కరోనా దుష్ప్రభావం దీర్ఘకాలం వెంటాడుతాయా? ఆ పరిస్థితి తప్పదంటోన్న ఆర్థిక సంస్థలు.. !
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ పెను ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు. ఈ దిశగా ఇప్పటికే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి కొన్ని అంచనాలను రూపొందించాయి. తాజాగా ఫిచ్ సొల్యూషన్స్ కూడా అదే రకమైన అంచనాలను విడుదల చేసింది. కరోనా వైరస్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.8 శాతానికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిదశలో 21 రోజుల పాటు, మలి దశలో 19 రోజుల పాటు లాక్డౌన్ను అమలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండోదశ లాక్డౌన్ అమల్లో ఉంది. లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా చెప్పుకొనే వ్యవసాయం, సేవారంగాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు బ్రేకులు పడ్డాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి.
ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. జీఎస్టీ రూపంలో రావాల్సిన ఆదాయం అందలేదు. దీని ప్రభావం వృద్ధి రేటుపై పడుతుందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఆయా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జీడీపీ వృద్ధి రేటును 1.8 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. భారత్ వంటి దేశంలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించాల్సి రావడం వంటి చర్యల వల్ల ఖజానాపై అదనపు భారం పడుతుందని పేర్కొంది.
నిజానికి- ఇదే ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ భారత జీడీపీ వృద్ధి రేటును ఇదివరకు 4.6 శాతానికి అంచనా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితును దృష్టిలో ఉంచుకుని ఈ శాతాన్ని 1.8 శాతానికి కుదించింది. ఇంతకుమించిన జీడీపీని భారత్ నుంచి ఆశించలేమని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇదే సంస్థ చైనా జీడీపీ వృద్ధి రేటును మరింత తగ్గించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చైనా వృద్ధి రేటు 1.1 శాతం మేరకే ఉంటుందని అంచనా వేసింది.
Recommended Video