అల్వార్ అత్యాచార ఘటన: ఈ ఐదుగురు నిందితులు ఏమి చేస్తున్నారో తెలుసా..?
ఏప్రిల్ 26న రాజస్థాన్లోని అల్వార్లో దళిత వివాహితపై కొందరు దుండగులు అత్యచారం చేసిన సంగతి తెలిసిందే. బైకుపై వస్తున్న దంపతులను కొందరు వ్యక్తులు అడ్డగించి భర్తముందే ఆ మహిళపై అత్యాచారం చేశారు. ఆపై వీడియో కూడా తీశారు. అనంతరం భర్తపై దాడి చేసి అతని వద్ద నుంచి రూ.2వేలు లాక్కున్నారు. ఏప్రిల్ 26న ఘటన జరుగగా ఏప్రిల్ 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే మే 7 వ తేదీవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేశారు.
రాజకీయ రంగు పులుముకున్న ఘటన
ఇక అత్యాచారం చేస్తున్న వీడియోను నిందితులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఒక్కసారిగా ఇది రాజకీయ రంగు పులుముకుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కావాలనే ఘటనను దాచి ఉంచిందనే విమర్శను మూటగట్టుకుంది. ఘటనపై ప్రధాని రాజకీయాలు చేయడం తగదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మరోవైపు రాజస్థాన్లో గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన మాయావతి కూడా ఘటనపై స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వం, కేసులో అలసత్వం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బెహెన్జీ డిమాండ్ చేశారు.
నిందితుల్లో ఒకరు ట్రక్కు డ్రైవరు
అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులు ఉండగా అందులో ఒకరు ట్రక్ డ్రైవర్ కాగా మరొకరు టీ స్టాల్లో పనిచేసేవాడని మరొకరు రోజువారీ కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడు చోటేలాల్ ట్రక్కు డ్రెవరుగా పనిచేస్తుండగా... కొన్ని రోజుల క్రితం అక్రమంగా మద్యం వ్యాపారం కూడా చేసినట్లు తెలుస్తోంది. బన్సూర్ పోలీస్ స్టేషన్లో చోటేలాల్పై గతంలో కూడా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. దోపిడీలు కూడా చేసిన చరిత్ర చోటేలాల్కు ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక చోటేలాల్ బంధువు హన్స్రాజ్ గుర్జార్ ఐటీఐలో తన పేరును నమోదు చేసుకున్నాడు.
హన్స్ రాజ్ ఇంట్లో ఫంక్షన్కు వచ్చిన నిందితులు
హన్స్రాజ్ ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ ఐదుగురు నిందితులు వచ్చారు. ఇక ఇంద్రాజ్ గుర్జార్ హన్స్రాజ్ సోదరిని వివాహం చేసుకున్నాడు. జీవనోపాధికి ట్రాక్టర్ నడుపుతుంటాడని పోలీసులు చెప్పారు. ఇక అశోక్ గుర్జార్ టీస్టాల్లో పనిచేస్తుండగా మరో నిందితుడు మహేష్ చిన్నా చితకా పనులు చేస్తుంటాడని.. మరో నిందితుడు ముఖేష్ గుర్జార్ అత్యాచార ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడని పోలీసులు తెలిపారు. వీరంతా అల్వార్ జిల్లాలోనే 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఇంకా జరుగుతోందని వారి వద్ద నుంచి మరింత కీలక సమాచారం రాబట్టే పనిలో ఉన్నట్లు చెప్పారు.