యువతిని వివస్త్రను చేసి దాడి: ఐదుగురు అరెస్ట్
బెంగుళూరు: టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి స్థానికులు భౌతిక దాడికి దిగిన కేసులో బెంగుళూరు పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను గురువారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించి ఈ ఐదుగురిని పోలీసులు విచారించనున్నారు.
వివరాల్లోకి వెళితే తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాకు చెందిన 21 ఏళ్ల యువతి స్థానిక ఆచార్య కాలేజీలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. స్నేహితులను కలిసేందుకు ఆదివారం రాత్రి కారులో ఆమె బయల్దేరింది. హెసరుఘట్ట ప్రాంతానికి రాగానే కారు అదుపుతప్పి పాదచారిని డీకొనడంతో 35 సంవత్సాల వ్యక్తి మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ సుందరేషన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో కారు వెనుక సీటులో కూర్చున్న విద్యార్థిని కిందికి దిగగానే, ఇంతలో అక్కడికి వచ్చిన స్థానికులు ఆగ్రహంతో విద్యార్ధినిపై దాడికి పాల్పడ్డారు. యువతి చెబుతున్నది వినిపించుకోక ఆ యువతి టీ షర్టును చించి వేశారు. ఎలాగో తప్పించుకుని నెమ్మదిగా కదులుతున్న బీఎంటీసీ బస్సు ఎక్కడానికి ప్రయత్నించింది.
అయినా సరే విద్యార్ధిని వెంటబడి నడిరోడ్డుపై ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థిని స్నేహితుల్లో ఒకరు బాధితురాలికి టీ షర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించడంతో యువతితో పాటు ఆమెకు సాయం చేయడానికి వచ్చిన వారిపై కూడా భౌతిక దాడికి అక్కడి స్థానికులు దిగారు.
దీంతో పాటు యువతి ప్రయాణస్తున్న వాహనాని తగులబెట్టారు. ఇంతలో సమాచారం అందుకున్న అక్కడికి చేరుకున్న పోలీసులు తమను రక్షించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదని బాధితురాలు వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మరోవైపు టాంజానియా హై కమిషనర్, విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సుష్మా స్వరాజ్ కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక ప్రభుత్వాన్ని గురువారం వివరణ కోరారు. ఈ సంఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక పంపించాలని రాహుల్ ఆదేశించారు.