బెంగళూరులో విదేశీయుల చేతి వాటం, మాజీ సీఎస్, ఘరానా గ్యాంగ్ లో లేడీ కిలాడి!
Recommended Video
బెంగళూరు: టిప్ టాప్ గా ఖరీదైన దుస్తులు వేసుకుని పర్యాటకులుగా నటిస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా బెంగళూరు నగరంలో చోరీలు చేస్తున్న ఐదు మంది విదేశీయులను జయనగర పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ తో పట్టుబడిన విదేశీయులు ఇప్పుడు కటకటాలపాలైనారు.
స్పెయిన్ (కోలంబియన్స్)కు చెందిన రోజర్ స్మిత్, ఎడ్వడ్ అలెంజాడ్రో, టి బెలియ, జే జోరియా, జోష్ ఎడ్వడ్ అనే ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఓ మహిళ కూడ ఉంది. బెంగళూరు చేరుకున్న ఈ ఐదు మంది హైటెక్ పద్దతిలో చోరీలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
జూన్ 22వ తేదీన జయనగరలోని ఓ ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. ఆ సమయంలో విదేశీ మహిళ ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి కాలింగ్ బెల్ ను 10 సార్లకు పైగా ఆమె ఆన్ చేసింది. ఇంటిలో ఎవ్వరూ లేరని తెలుసుకుని మిగిలిన నలుగురికి సమాచారం ఇచ్చింది.
నలుగురు విదేశీయులు యువతి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లారు. తరువాత ఇంటి తలుపులు తీసి చోరీ చెయ్యడానికి ఈ ఐదు మంది విఫలయత్నం చేశారు. వీలు కాకపోవడంతో ఐదు మంది అక్కడి నుంచి చాకచక్యంగా వెళ్లిపోయారు.
ఇంటికి వచ్చిన యజమాని సీసీ కెమెరాల్లో క్లిప్పింగ్స్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెంగళూరులో ఉన్న విదేశీయుల మీద నిఘా వేసి ఈ ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి చిరునామా తెలుసుకునే ముసుగులో మొదట మహిళ ఇళ్ల దగ్గరకు వెలుతుందని పోలీసులు అన్నారు.
ఇంటి కాలింగ్ బెల్ పదేపదే కొట్టడం, ఇంటిలో నుంచి ఎవరైనా బయటకు వస్తే ఏదో ఒక చిరునామా అడిగి అక్కడి నుంచి వెళ్లిపోతుందని పోలీసులు అన్నారు. ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రాకుంటే ఆ మహిళ మిగిలిన నలుగురిని పిలిపించి తలుపు తాళం పగలగొట్టి చోరీలు చేస్తున్నారని పోలీసులు అన్నారు.
జూన్ 16వ తేదీ హెచ్ఎస్ఆర్ లేఔట్, 6వ సెక్టార్ లో నివాసం ఉంటున్న కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఐదు మంది ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీ ఇంటికి వెళ్లారు.
కౌసిక్ ముఖర్జీ ఇంటి తాళం పగలగొట్టి రూ. 25 లక్షల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేసినట్లు విచారణలో అంగీకరించారని పోలీసులు అన్నారు. భారతదేశానికి వీరు ఎప్పుడు వచ్చారు, ఎన్ని ప్రాంతాల్లో చోరీలు చేశారు అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.