ఒక్క కొడుకు కోసం ఐదుగురు బిడ్డలు... అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే...
ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయాలనుకున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. చివరకు ఆ వ్యాఖ్యలు ఆయన్నే డిఫెన్స్లోకి నెట్టడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ కాస్త జరిగిపోయింది. వివాదం జాతీయ మహిళా కమిషన్ వరకూ వెళ్లడంతో... ఆయనపై చర్యలు తప్పేలా లేవు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు చెందిన ఆ ఎమ్మెల్యే కేంద్రంలోని బీజేపీ వైఫల్యాన్ని కౌంటర్ చేసేందుకు... ఓ ముతక పోలికను ముందుకు తెచ్చి అడ్డంగా ఇరుక్కుపోయారు.
జీతు పట్వారీ ఏమన్నారు...
మధ్యప్రదేశ్లోని రౌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీతు పట్వారీ బుధవారం(జూన్ 24) చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ ట్వీట్లో బీజేపీని టార్గెట్ చేసిన పట్వారీ.. 'మగబిడ్డ పుట్టాలన్న ఆశతో ఎదురుచూస్తే... బీజేపీ ఇప్పటివరకూ ఐదుగురు కుమార్తెలను కన్నది. 1.నోట్ల రద్దు 2.జీఎస్టీ 3.ద్రవ్యోల్బణం 4.నిరుద్యోగం 5.సంక్షోభం. కానీ ఇప్పటివరకూ కొడుకు(వికాస్-అభివృద్ది) మాత్రం పుట్టలేదు.' అని పట్వారీ అందులో పేర్కొన్నారు.
జాతీయ మహిళా కమిషన్ దృష్టికి...
పట్వారీ చేసిన ఈ ట్వీట్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడపిల్లల పుట్టుకను చులకన చేసేలా ఆయన మాట్లాడటం దారుణమని చాలామంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ అధికారి ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ దృష్టికి తీసుకెళ్లారు. మహిళల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన పట్వారీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వ్యాఖ్యల్లో అసలు కుమార్తెలు పుట్టకూడదన్న అర్థం ధ్వనిస్తోందన్నారు. దీనిపై స్పందించిన రేఖా శర్మ...' ఇలాంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు తమను తామను నాయకులని చెప్పుకోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలతో వారు ఏం చెప్పదలుచుకుంటున్నారు. అతని నుంచి తప్పక వివరణ కోరుతాం. అని చెప్పారు.
క్షమాపణ చెప్పిన పట్వారీ...
తన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో జీతు పట్వారీ వెంటనే అప్రమత్తమయ్యారు. 'నా వ్యాఖ్యలకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే.. దానికి చింతిస్తున్నాను. కుమార్తెలంటే ఆరాధించదగినవారు. కానీ నా ట్వీట్స్ను బీజేపీ వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. నేను మరోసారి నొక్కి చెబుతున్నా... ఇప్పటికీ ఈ దేశం వికాస్(అభివృద్ది) కోసం ఎదురుచూస్తూనే ఉంది.' అని చెప్పుకొచ్చారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ ఫైర్....
జీతు పట్వారీ ట్వీట్పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'ఓవైపు దేశమంతా రాణి దుర్గావతి త్యాగాన్ని గుర్తుచేసుకుంటుంటే... మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ దేశ ఆడబిడ్డలను అవమానాలకు గురిచేస్తున్నారు. నైనా సాహ్ని,సర్ల మిశ్రా,ప్రీతి మిశ్రా వంటి ఆడబిడ్డల ప్రాణాలను కాంగ్రెస్ దుష్ట మనస్తత్వమే బలి తీసుకుంది.' అంటూ ఫైర్ అయ్యారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో...
జీతూ పట్వారీ 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా తన కామెంట్స్తో హాట్ టాపిక్ అయ్యారు. ఆ సమయంలో ఇంటింటి ప్రచారం చేసిన ఆయన... పార్టీ ఓడిపోయినా తనను మాత్రం గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. 'మీరు నా గురించి ఆలోచించండి. నా పరువు కాపాడండి. పార్టీ పోతే పోనివ్వండి.. నాకు మాత్రం ఓటేసి గెలిపించండి.' అంటూ అందులో పట్వారీ పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి చేశాను తప్ప కాంగ్రెస్ పార్టీని కాదంటూ ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.