సెలవుపై వెళ్లిన లోకాయుక్త భాస్కర్ రావ్
బెంగళూరు: లోకాయుక్తలో అవినీతి జరిగిందని, రూ. కోటి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో ఇంత కాలం తలపట్టుకున్న లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ ఐదు రోజులు సెలవు (బుధవారం నుండి) పెట్టి వెళ్లిపోయారు.
సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించిన సమయంలోనే లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ సెలవు పెట్టడం చర్చకు దారితీసింది. లోకాయుక్తలో జరిగిన అవినీతిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకే భాస్కర్ రావ్ సెలవు మీద వెళ్లి ఉంటారని సమాచారం.
లోకాయుక్తలో లంచం డిమాండ్ చేశారని , భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ప్రమేయం ఉందని బహిరంగంగానే పేరు బయటకు వచ్చింది. ఇదే సమయంలో లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఏడీజీపీ కమల్ పంత్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి విచారణ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందంలో డీఐజీ సౌమేంద్ర ముఖర్జీ, బెంగళూరు తూర్పు, కేంద్ర విభాగం డీసీపీలు లాబూరామ్, సందీప్ పాటిల్ తో సహ 12 మంది అధికారులు ఉన్నారు.