బెంగాల్లో ఐదు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసన కారులు...!
పౌరసత్వ సవరణ బిల్లుపై అటు ఈశాన్య రాష్ట్రాల్లో నాలుగు రోజులు కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుతుంటే... ఉత్తర భారతంతో పాటు దేశ రాజధాని ప్రాంతంలో అవి మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్లో పౌర సవరణ బిల్లుపై నిరసనకారులు రాష్ట్రంలోని అయిదు రైళ్లను తగులపెట్టారు. దీంతోపాటు పలు రైల్వేస్టేషన్లకు నిప్పుపెట్టారు. మరోవైపు స్టేషన్లో రైల్వే పోలీసులను సైతం చితకబాదారు. బస్సులను తగలబెట్టారు.
ఐదు రైళ్లకు నిప్పు
పౌరసత్వ సవరణ బిల్లుపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల నుండి నిరసలు మిన్నంటాయి. రాష్ట్రంలోని కేంద్ర రవాణా వ్యవస్థకు నిరసన కారులు తగులబెడుతున్నారు. ముఖ్యంగా రైళ్లు, రైల్వే స్టేషన్లను అందోళనకారులు టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే లగోలా రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతోపాటు హౌరాలోని సంక్రాలి రైల్వే స్టేషన్కు సైతం నిప్పుపెట్టారు. దీంతో అక్కడ ఉన్న పలు షాపింగ్ మాల్స్ మొత్తం తగులబడ్డాయి.
రైల్వే స్టేషన్ను తగలబెట్టిన అందోళనకారులు
ఇక శుక్రవారం జరిగిన అందోళనల్లో కూడ ఇలాంటీ సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేడు అవి తీవ్రరూపం దాల్చాయి. దీంతో బెంగాల్ని ముర్షిదాబాద్ రైల్వే స్టేషన్కు నిరసన కారులు నిప్పు పెట్టారు. బెల్దంగా రైల్వే కాంప్లెక్స్ లోకి దూసుకు వెళ్లి అక్కడ ఉన్న రైల్వే పోలీసులపై దాడులు చేశారు. హైరాలోని పదిహేను బస్సులను సైతం తగలబెట్టారు. బెంగాల్లోని పలుజిల్లాలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది. కోల్కతా నగరంలో కూడ సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ మొత్తం నిలిపివేసిన పరిస్థితి కనిపించింది. నిరసలతో పలు రైళ్ల సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించగా విమాన సర్వీసులు కూడ రద్దు చేశారు..
రాజకీయంగా మారిన పౌర బిల్లు
మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రంలోని గవర్నర్ మరియు ముఖ్యమంత్రి విభిన్న ప్రకటనలు చేశారు. బిల్లును ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే గవర్నర్ జగ్దీప్ మాత్రం ఇందుకు విరుద్దంగా స్పందించారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లును అందరు అమోదించాలని, ఇది దేశవ్యాప్తంగా రాష్ట్రాల అనుమతి లేకుండానే అమల్లోకి వస్తుందని ,దీన్ని కాదనే అధికారం ఎవ్వరికి లేదని గవర్నర్ అన్నారు. శాంతిభద్రతలను ఎవ్వరు చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.