దారుణం: కర్ణాటకలో ఐదుగురు తమిళ కూలీల నరికివేత
బెంగళూరు: తమిళనాడుకు చెందిన ఐదుగురిని కర్ణాటకలో దారుణంగా నరికి చంపారు. హత్యకు గురైనవారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. తమిళనాడు సరిహద్దులో గల చామరాజనగర జిల్లాలోని హరాలే గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
మృతులంతా తమిళనాడుకు చెందిన వ్యవసాయ కూలీలు. చెరుకు తోటలో పనిచేస్తూ అక్కడే వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటున్న గుడారాల్లో ఉంటున్నారు.
మృతులను పోలీసులు గుర్తించారు. రోజా (11), శివమ్మ (35), కాశి (40), రాజేంద్ర (35), రాజమ్మ (35) అనే ఐదుగురిని నరికి చంపారు. మంగళవారం ఉదయం చెరుకు పంట యజమాని వచ్చే సరికి వారు మరణించి ఉన్నారు.
కాంట్రాక్టర్ రాజేంద్రకు, కూలీలకు మధ్య మద్యం సేవించిన తర్వాత తగాదా జరిగి ఉంటుందని, ఈ తగాదా కారణంగానే హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిలో రాజేంద్ర కూడా మరణించాడు.
కూలీ కోసం తమిళనాడు నుంచి చెరుకు తోటలో పనిచేయడానికి 16 మంది కూలీలు వచ్చారు. వారంతా అక్కడే ఉంటున్నారు. ఈ హత్యల తర్వాత మిగతా కూలీలు పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య చేయడానికి పదునైన ఆయుధాలతో పాటు భారీ వస్తువులను వాడినట్లు పోలీసులు చెబుతున్నారు.