హిందూ నేతల హత్యకు కుట్ర, ఐదుగురు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
కోయంబత్తూరు: పలువురు హిందూ నేతల హత్యకు కుట్ర చేసిన ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నుంచి కోయంబత్తూరు వచ్చిన నలుగురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(ఎస్ఐయూ) పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
తాము ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నిజాన్ని అంగీకరించారు. హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్, హిందూ మున్నాయ్ నేత మూకాంబికాయ్ మణి, ఇతర నేతలను హతమార్చేందుకు వీరు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.
నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలతో పాటు, కుట్ర కేసును నమోదు చేశారు. అనంతరం వారిని కేంద్ర కారాగారానికి తరలించారు. హిట్ లిస్ట్లో ఉన్న హిందూ నేతలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.