శ్రీలంకలో అంతకంతకు పెరుగుతున్న మృతులు..చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులు..
కొలంబో : పదేళ్ల ప్రశాంతతకు భంగం కలిగిస్తూ శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లు భారీ ప్రాణనష్టం మిగిల్చాయి. కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 290 మందికిపైగా చనిపోయారు. 500మందికిపైగా క్షతగాత్రులు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!
మృతుల్లో ఐదుగురు భారతీయులు
ఉగ్రదాడిలో భారీ సంఖ్యలో విదేశీయులు చనిపోయినట్లు తెలుస్తోంది. శ్రీలంక చెప్పిన లెక్కల ప్రకారం దాడిలో ఇప్పటి వరుకు 32 మంది విదేశీయులు మృతిచెందారు. కొలంబో పేలుళ్లలో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. రమేష్, లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్లు మృతి చెందినట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించగా.. తాజాగా కేజీ హనుమంతరాయప్ప, ఎమ్ రంగప్ప అనే వ్యక్తులు కూడా కన్నుమూశారని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
24 మంది అనుమానితుల అరెస్ట్
బాంబు దాడులకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 24 మంది నిందితుల్ని శ్రీలంక పోలీసులు అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 24 మందిలో 13 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించగా.. మరో 11 మందిని సీఐడీకి అప్పగించారు.
కర్ఫ్యూ ఎత్తివేత
కొలంబోలో ఎనిమిదవ పేలుడు జరిగిన వెంటనే నిరవధిక కర్ఫ్యూ విధించిన శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యూను ఎత్తివేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కొలంబోలోని ప్రార్థనాలయాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వదంతులు వ్యాపించే అవకాశమున్నందున సోషల్ మీడియాపై నిషేధం విధించింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.