రోహ్తక్లో కాల్పులు: మహిళా రెజ్లర్లు, కోచ్ సహా ఐదుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఛండీగఢ్: హర్యానాలోని రోహ్తక్ రెజ్లింగ్ అఖాడ వద్ద జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ ప్రైవేటు కాలేజీకి పక్కనే ఉన్న ఈ ఆఖాడాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని, వారిలో ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఐదుగురు మృతుల్లో ముగ్గురిని ప్రదీప్ మాలిక్, పూజ, సాక్షిగా గుర్తించినట్లు చెప్పారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. మృతుల్లో ఇద్దరు మహిళా రెజర్లు, ఓ కోచ్ ఉన్నారని దైనిక్ జాగరణ్ తన కథనంలో వెల్లడించింది.
ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి పీటీఐకి తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు విచారణాధికారులు పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారని రోహ్తక్ రేంజ్ ఐజీ సందీప్ ఖిర్వార్ తెలిపారు.