ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్...ఐదుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోమారు తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ జిల్లాలోని అభుజ్మద్ అడవుల్లో భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదు మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్లు బస్తర్ పోలీసులు తెలిపారు. ఆగష్టు 3న రాజ్నంద్గావ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడు మంది మావోలు మృతి చెందిన ఘటన మరువక ముందే ఇదే నెలలో రెండో సారి ఎన్కౌంటర్ జరగడం విశేషం.
ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఛత్తీస్గఢ్ పోలీస్ బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. దుర్వేదా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందుకున్న ఛత్తీస్గఢ్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. నారాయణపూర్ జిల్లా అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. భద్రతాబలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగారని చెప్పారు. దాదాపు 90 నిమిషాల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు డీజీపీ డీఎం అవాస్తి వివరించారు.
ఇక ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత పోలీసులు ఘటనా స్థలంలో ఐదు మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు డీజీపీ తెలిపారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్య అభుజ్మద్ అడవులు విస్తరించి ఉన్నాయి.బ్రిటీష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు 6వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన అడువుల్లో సర్వే చేయలేదు. 2017లో నారాయణపూర్ జిల్లా అధికారులు సర్వే చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ సమయంలో ఐఈడీ పేలుడు జరగడంతో ఆలోచన విరమించుకున్నారు. ఇక ఈ దట్టమైన అడవి మావోల కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పోలీసులు చెబుతున్నారు.