కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభం ముగిసిందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మణిపూర్లో మరో షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు.
Recommended Video
బీజేపీ జాతీయ అధ్యక్షుడితో ఎమ్మెల్యేల భేటీ..
అనంతరం ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. కాగా, ఈ ఐదుగురు ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ లేజిస్లేచర్ పార్టీ లీడర్ ఓక్రమ్ ఇబోబీ సింగ్ మేనల్లుడు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, ఇది జరిగిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీకి తీసుకెళ్లిన సీఎం..
విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మంగళవారం తొలి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ విప్ దిక్కరించి విశ్వాస పరీక్షకు హాజరుకాని, ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లారు. బీరేన్ సింగ్ అల్లుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే ఇమో సింగ్ కూడా వీరితోపాటు ఢిల్లీకి వెళ్లారు.
ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో..
కాగా, మంగళవారం జేపీ నడ్డాను కలిసిన మణిపూర్ సీఎం రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం బీరేన్ సింగ్కు నడ్డా అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆస్టు 10న మణిపూర్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. అయితే, విశ్వాస పరీక్షకు ముందే ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీకి హాజరుకాలేదు. ఇక 28 ఓట్లు బీజేపీకి రాగా, కాంగ్రెస్ పార్టీకి 16 ఓట్లే రావడంతో బీజేపీ ప్రభుత్వం నిలబడింది.