బీజేపీకి బైపోల్స్ ఫీవర్: మరో ఐదు స్థానాలకు త్వరలోనే ఎన్నికలు! వ్యూహాలతో విపక్షాలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు మాత్రం కలిసి రావడం లేదు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫుల్పూర్ నియోజకవర్గాల్లో ఓటమితో బీజేపీ ఎంపీల స్థానాలు 274కి చేరుకున్నాయి.
కాగా, ఇది సింపుల్ మెజార్టీకి కేవలం 2 స్థానాలు మాత్రమే అధికంగా ఉండటం గమనార్హం. ఒక వేళ స్పీకర్ సుమిత్రా మహాజన్ను ఈ జాబితా నుంచి తీసివేస్తే ఆ సంఖ్య కాస్తా 273కి పడిపోతుంది. అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత 282 స్థానాలో బీజేపీ ఖాతాలో ఉన్న విషయం తెలిసిందే.
ఆందోళనలోనే..
ఇది ఇలా ఉంటే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలను ఎదుర్కొనుండటంతో ఆ పార్టీకి కొంత ఆందోళన కలిగిస్తోందనే చెప్పాలి. అయితే, ఈ ఐదు స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ఖరారు చేయలేదు.
మూడు బీజేపీవే..
కాగా, ఈ ఐదు ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో మూడు కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన స్థానాలే కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భందారా-గొండియా లు ఉన్నాయి.
కైరానాతో బీజేపీకీ హైరానా...
‘కైరానాలో కూడా బీజేపీకి గట్టి పోటీనే ఎదుర్కోనుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల కలియిక బీజేపీ నష్టం కలిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కైరానా రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు' అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
రాహుల్ మంతనాలు.. శివసేన చిందులు
ఇటు మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలులు కూడా బీజేపీకి ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి. బీజేపీని ఓడించేందుకు శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. గత కొద్ది వారాల కాలంలోనే శరద్ పవార్ను నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలుమార్లు కలవడం గమనార్హం. అంతేగాక, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన కూడా అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది.
బీజేపీకి బైపోల్స్ ఫీవర్ తప్పడం లేదు!
ఇక మిగితా రెండు లోకసభ స్థానాలు బీజేపీ తన కూటమితో గెలిచినవే. నాగాలాండ్ ఎంపీ స్థానం నుంచి గెలుపొంది ఇటీవల నాగాలాండ్ సీఎంగా ప్రమాణం చేసిన నెపూ రియో ఆ స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయింది. మరోటి జమ్మూకాశ్మీర్లోని అనంత్ నాగ్ నుంచి గెలుపొందిన పీపుల్స్ డెమోక్రాటిక్ అలియన్స్(పీడీపీ) మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు లోకసభ స్థానాలను కోల్పోయిన బీజేపీ తీవ్రమైన ఒత్తిడిలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ-ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావడం బీజేపీని మరింత ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు.