పీఓకేలో భారత ఆర్మీ మరోదాడి.. ఆరుగురు పాక్ జవాన్ల మృతి.. నాలుగు ఉగ్రశిబిరాలు ధ్వంసం
జమ్ము కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. పాకిస్తాన్, భారత బలగాల మధ్య బీకర పోరు జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులు అక్రమంగా భారత్లోకి చోచ్చుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారత భద్రత దళాలు సమర్ధవంతగా తిప్పికోట్టాయి. చోరబాటు దారులు అడ్డుకునేందుకు మరోసారి పీవోకేలో భారత ఆర్మీ దాడులు కొనసాగించింది.. పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై బాంబుల వర్షం కురిపించారు. దీంతో ఈ దాడుల్లో నాలుగు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం కావడంతో పాటు ఆరుగురు పాకిస్తాన్ ఆర్మీ జవానులు మృతిచెందినట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ దళాలపై మరోసారి విరుచుకుపడ్డ భారత ఆర్మీ
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తాంగ్ధార్ సెక్టార్ ప్రాంతంలోని నీలం ఘాట్ ప్రాంతంలో ఆర్మీ ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తాన్ ఆర్మి పోస్టులపై మెరుపుదాడులు చేసింది. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ నుండి చోరబాట్లు వస్తున్న నేపథ్యంలోనే వాటిని అడ్డుకునేందుకు భారత ఆర్మీ ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం భారత ఆర్మి పెద్ద ఎత్తున ఆయుధాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్కు మరోసారి బుద్ది చెప్పేందుకు ఫిరంగులతో దాడిని చేసింది. దీంతో పీవోకేలోని నాలుగు టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీపోస్టులపై దాడులు చేయడంతో ఆరుగురు పాకిస్తాన్ జవాన్లు మృత్యువాత పడ్డట్టు సమాచారం.
కుప్వారాలో కాల్పులు జరిపిన పాకిస్తాన్ ఆర్మీ
ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే...అప్పటి నుండి భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో అహర్నిశలు కృషి చేస్తోంది. దీంతో సరిహద్దు తీరం వెంట పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యను తీసుకెళ్లేందుకు, భారత సరిహద్దు ప్రాంతంలో పలుసార్లు కాల్పులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఒక పౌరుడు మృతి చెందాడు.
సంవత్సకాలంగా రెండువేల సార్లు ఒప్పందాల ఉల్లంఘన
గత వారం రోజుల క్రితమే ఎల్ఓసీ వెంట ఉన్న బారముల్లా, మరియు రాజౌలి ప్రాంతంలో కాల్పులు విరమణ ఉల్లంఘించింది. భారత ఆర్మిపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు మృతి చెందారు. కాగా జూలైలో 296 సార్లు, ఆగస్టులో 307 సార్లు సెప్టెంబర్లో 292 సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్దంగా వ్యవహరించారని మొత్తం మీద గత సంవత్సరం నుండి 2050 సార్లు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు జరగగా మొత్తం 21 మంది ప్రజలు మృతి చెందినట్టు భారత అర్మి అధికారులు ప్రకటించారు. అయితే పాకిస్తాన్ క్వింపు చర్యలకు భారత అధికారులు కూడ పలుసార్లు తీవ్రంగా స్పందించినా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు ఫుల్స్టాప్ పెట్టడం లేదు.