టైరు పేలి..లారీని ఢీ కొట్టి..!
ధర్వాడ: కర్ణాటకలోని ధార్వాడలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ధర్వాడ జిల్లా నవలగుందె తాలూకా పరిధిలోని అమరగూళ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బాగలకోటె జిల్లా కవలపేటెకు చెందిన రవి హండి, లేఖాశ్రీ హండి, నవీన్కుమార్ హండి, శరణ, వర్షా జిగజిన్ని ఆదివారం ఉదయం కారులో ధార్వాడకు బయలుదేరారు. మార్గమధ్యలోనవలగుందె-నరగుందె గ్రామాల మధ్య రహదారిపై కారు టైరు పేలిపోయింది.
ఫలితంగా- కారు అదుపు తప్పింది. ఎదురుగా వస్తోన్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు సంఘటనాస్థలంలోనే మరణించారు. మరో ఇద్దరిని ఆసుప్రతికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. కారు ముందు భాగం మొత్తం తునాతునకలైంది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే నవలగుందె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం చోటు చేసుకున్న విషయాన్ని మృతుల కుటుంబీకులకు తెలియజేశారు. బాగల్కోటె జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ జిగజిన్నికి సమీప బంధువులగా గుర్తించారు.