తిరుమలకు వెళ్లి వస్తూ ఒకే ఫ్యామిలీలో ఐదు మంది దుర్మరణం, అతి వేగం !
బెంగళూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వెలుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీలో ఐదు మంది దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని కలబురిగి నగరం సమీపంలో జరిగింది. స్కార్పియో కారు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహ ఒకే ఫ్యామిలీలో ఐదు మంది మరణించారు.
మహారాష్ట్రలోని దక్షిణ సోల్లాపురలోని చించపురకు చెందిన ఓ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తిరుమల వెళ్లారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తరువాత కుటుంబ సభ్యులు స్కార్పియో కారులో సోల్లాపుర బయలుదేరారు.
మార్గం మద్యలో కర్ణాటకలోని కలబురిగి నగరం శివార్లలోని అళంద రోడ్డులో ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ స్కార్పియో కారును ఢీకొనింది. ఈ ప్రమాదంలో సంజయ్ కుమార్, రాణి సంజయ్, భాగ్య శ్రీ, శ్రేయస్ (2), ధీరజ్ సంగన్న (3) అనే ఐదు మంది దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో శివరాజ్, శీతల్ సంగన్న, భీమాశంకర్ అనే ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వేగంగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడం వలనే ప్రమాదం జరిగిందని, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని కలబురిగి పోలీసులు తెలిపారు.