కేంద్ర హోంశాఖ ఆదేశం: మమత నిరసనలో పాల్గొన్న పోలీసుల మెడల్స్ వెనక్కు తీసుకోండి
వెంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు అయ్యింది పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారుల పరిస్థితి. కొద్దిరోజుల క్రితం మమతా బెనర్జీకి కేంద్రం మధ్య జరిగిన పొలిటికల్ గేమ్లో పోలీసులు బలయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సీబీఐకి వ్యతిరేకంగా కోల్కతాలో నిరసనలు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఐదుగురు పోలీస్ ఉన్నతాధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీ చేతులమీదుగా అందుకున్న మెడల్స్ను కూడా వెనక్కు తీసుకోవాలని ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఐదుగురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లను ఎంపానెల్డ్ జాబితాలో నుంచి తొలగించి కొంతకాలం పాటు వారిని కేంద్ర సర్వీసులకు దూరం ఉంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మమత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్ర, అడిషనల్ డీజీపీ వినీత్ కుమార్ గోయల్, శాంతి భద్రతల అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీసు అనూజ్ శర్మ, బీదానగర్ కమిషనరేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గ్యాన్వంత్ సింగ్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుప్రతీం దర్కార్లను కేంద్రం గుర్తించింది. ఇలాంటి పరిణామాలు వచ్చిన సమయంలో ఎవరికీ కొమ్ముకాయకూడదన్న కనీస విషయాన్ని విస్మరించి పొలిటికల్ స్టాండ్ తీసుకుని నిరసనలో పాల్గొన్నారని కేంద్రం ఆరోపించింది. ఇదిలా ఉంటే బెంగాల్ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను సీరియస్గా తీసుకోకపోయినప్పటికీ ఇది రాజకీయంగా మరింత అగ్గిని రాజేసే విషయం అవుతుంది.
ఫిబ్రవరి 4వ తేదీన శారదా చిట్ఫండ్ స్కాములో కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ను విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు వచ్చారు. దీంతో సీబీఐని మమతా అడ్డుకున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు రాజీవ్ కుమార్ సీబీఐకు సహకరించాలని చెప్పడం ఆయన పిటిషన్ దాఖలు చేయడం అన్ని జరిగిపోయాయి. అయితే అంతకుముందే ఆలిండియా సర్వీసు రూల్స్ను సీపీ రాజీవ్ కుమార్ ఉల్లంఘించారంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వాన్ని సూచించింది. అయితే ఢిల్లీ నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.