Narcoterrorism: ఉగ్రవాదం సరికొత్త రూపం: భారీ ఎన్కౌంటర్..అయిదుమంది అరెస్ట్: భారత్ బంద్ వేళ
న్యూఢిల్లీ: ఉగ్రవాదం సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఇన్నాళ్లూ ఆత్మాహూతి, బాంబు పేలుళ్లతో అట్టుడికిించిన ఉగ్రవాదులు.. తమ రూటు మార్చారు. నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకుంటున్నారు. యువతను నిర్వీర్యం చేసే చర్యల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తూ సోమవారం ఉదయం దేశ రాజధానిలో అయిదుమంది ఉగ్రవాదులు పోలీసుల చేతికి చిక్కారు.
ఢిల్లీలోని షకర్పూర్ ఏరియాలో భారీ ఎన్కౌంటర్ అనంతరం వారిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధానిని రైతులు చుట్టుముట్టిన వేళ.. మరో 24 గంటల్లో భారత్ బంద్ చేపట్టబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో న్యూఢిల్లీలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. షకర్పూర్ ఏరియాలో ఉగ్రవాదులు మాటువేశారని, వారు డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్పెషల్ సెల్ పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీనితో వారు తెల్లవారు జామున షకర్పూర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెద్ద ఎత్తున తనిఖీలను చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు పోలీసులసై కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పోలీసులు వారిపై ఎదురు కాల్పులు చేశారు. సుమారు 20 నిమిషాల పాటు ఎన్కౌంటర్ కొనసాగింది.అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని మారణాయుధాలు, పెద్ద ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అయిదుమందిలో ఇద్దరు పంజాబ్కు చెందిన వారు.. కాగా ముగ్గురు జమ్మూకాశ్మీర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
Recommended Video
జమ్మూ కాశ్మీర్ నుంచి మాదకద్రవ్యాలను పంజాబ్కు సరఫరా చేయడానికి ప్రయత్నించినట్లు అనుమానించారు. ఈ అయిదుమందికీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో చాలాకాలం నుంచి వారు పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. నార్కో టెర్రరిజం కింద కేసులు నమోదు చేసినట్లు స్పెషల్ సెల్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుష్వాహా తెలిపారు.