జమ్మూలో ఎన్కౌంటర్: ఐదుగురు ఉగ్రవాదుల మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. భారత సైన్యం, కేంద్ర రిజర్వు పోలీసు దళం, జమ్మూ-కశ్మీరు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
జమ్మూ రాష్ట్రంలోని బడిగామ్ ఇమామ్ సాహిబ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఎదురు కాల్పుల తర్వాత ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతం చేశాయి. ఈ ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
జమ్మూ-కశ్మీరు డీజీపీ శేష్ పాల్ వైద్ భద్రతా సిబ్బందిని అభినందించారు. వైద్ ఓ ట్వీట్లో షోపియాన్లోని జైన్పొర ప్రాతంలో ఉన్న బడిగామ్ గ్రామంలో ఎన్కౌంటర్ ముగిసింది. ఐదుగురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులు చేసిన కృషికి అభినందనలు అని ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.
భద్రతా దళాలను నిరోధించేందుకు స్థానికులు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. దీంతో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను ఈ ప్రాంతానికి తరలించారు. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ తాము ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరామని, కానీ ఫలితం లేకపోయిందని చెప్పారు.