చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్య
రాంచీ: చేతబడి చేస్తున్నారని, మంత్రాలు వేస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు మహిళలను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన జార్ఖండ్ లో జరిగింది. జార్ఖండ్ రాజధాని రాంచీకి 45 కిలో మీటర్ల దూరంలోని ఒక గిరిజన గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
గిరిజన గ్రామంలో ఒక కుటుంబం నివాసం ఉంటోంది. వీరు సాటి బంధువులతో కలిసి చేతబడి చేస్తున్నారని, మంత్రాలు వేస్తున్నారని, అందుకే గ్రామంలో చాల మంది అనారోగ్యానికి గురైయ్యారని గ్రామస్తులు అనుమానం పెంచుకున్నారు.
ఆ కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులను మాట్లాడటం మానుకున్నారు. ఇటివల అనారోగ్యంతో ఒక మహిళ మరణించింది. వీరు మంత్రాలు వెయ్యడం వల్లనే ఆమె మరణించిందని అనుమానం పెంచుకున్న గ్రామస్తులు వారి మీద కక్ష పెంచుకున్నారు.
శుక్రవారం రాత్రి మహిళలు ఇంటిలో పూజలు చేస్తున్న సమయంలో గ్రామస్తులు వారి ఇంటిలో చోరబడ్డారు. తరువాత ఐదుగురు మహిళల మీద కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఐదుగురు మహిళల హత్య కేసులో ఇప్పటి వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని శనివారం పోలీసు అధికారులు తెలిపారు. గ్రామంలోని చాల మంది ఇప్పటికే పరారైనారు. 2000 నుండి 2012 సంవత్సరాల మద్యలో చేతబడి చేస్తున్నారని, మంత్రాలు వేస్తున్నారని ఆరోపిస్తు జార్ఖండ్ లో 363 మంది హత్యకు గురైనారని పోలీసు అధికారులు తెలిపారు.