తస్మాత్ జాగ్రత్త: చిన్నారులను కబళిస్తోన్న ప్రాణాంతక వైరస్... ఏమిటా వైరస్..?
ఓ ప్రాణాంతక వైరస్ ప్రజలను భయపెడుతోంది. ఈ వైరస్ ఒకప్పుడు ఉండేది. కానీ ఈ మధ్యే మళ్లీ ఇది కోరలు చాచుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీని బారిన పడి ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో ఈ భయంకర వైరస్ పై ప్రజలు అప్రమత్తతతో ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంతకీ ఈ వైరస్ ఏమిటి..? ఏ రాష్ట్రంలో దీని లక్షణాలు కనిపించాయి...
చిన్నారుల ప్రాణాలు తీస్తోన్న చండీపురా వైరస్
చండీపురా వైరస్...ఇదేంటి ఊరుపేరుతో ఈ వైరస్ ఉందని ఆశ్చర్యపోకండి. మహారాష్ట్రలోని చండీపురా అనే పట్టణంలో ఈ వైరస్ కనుగొన్నారు. ఆ ఊరిపేరునే ఈ వైరస్ కు పెట్టడం జరిగింది. ఈ వైరస్ సోకిన వారు బతకడం చాలా అరుదు. ఇటీవలే అంటే గతనెలలో ఈ వైరస్ సోకి ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. గుజరాత్ లోని దాహోద్ లో ఓ ఐదేళ్ల బాలికకు రక్త పరీక్ష చేయగా చండీపురా వైరస్ సోకి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మొత్తం నాలుగు కేసులు బయటపడగా అందులో ఇద్దరు చిన్నారులు ఇప్పటికే మృతి చెందారు. మరో ఇద్దరిని స్పెషల్ కేర్ లో ఉంచారు.
ఈ వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనుగొన్నారు..?
మహారాష్ట్రలోని చండీపురా అనే పట్టణంలో పుట్టిన ఈ వైరస్ ఒక్కసారి సోకితే దీనివల్ల మెదడు దెబ్బతింటుంది. ఆ తర్వాత క్రమంగా మనిషి కోమాలోకి వెళ్లిపోయి ఆపై మృతి చెందడం జరుగుతుంది. 1965లో పూణేలోని నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేస్తున్న ఇద్దరు వైరాలజిస్టులు చండీపురా వెసిక్యులోవైరస్ ను తొలుత కనుగొన్నారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఈ ప్రాణాంతక వైరస్ సోకే అవకాశం ఉంది. 2014లో చివరిసారిగా గుజరాత్ లో దీన్ని గుర్తించారు ఆ సమయంలో ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు. 2010లో 29 కేసులను గుర్తించగా అందులో 17 మంది చిన్నారులు మృతి చెందారు.
చండీపురా వైరస్ ఎలా సోకుతుంది..?
ఈ వ్యాధి ఈగలు, దోమలనుంచి మనిషికి సోకుతుంది. ఈ వైరస్ మనిషి నరాల వ్యవస్థను డ్యామేజ్ చేస్తుందని జంతు శాస్త్రం బోధిస్తోంది. దోమలు కుట్టిన తర్వాత విడుదల చేసే ద్రవంతో వైరస్ సోకుతుంది. ముఖ్యంగా నైజీరియా భారత్ దేశాల్లో దీని బారిన ఎక్కువ మంది పడి చనిపోతున్నారు. దక్షిణ భారతదేశంలో చండీపురా వైరస్ 329 మంది చిన్నారులకు సోకగా అందులో 183 మంది మృత్యువాత పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
చండీపురా వైరస్ లక్షణాలు ఏంటి..ఎలా నివారించొచ్చు..?
ఇక వీటి లక్షణాలు ఇలాగుంటాయి. ఒక్కసారిగా విపరీతమైన తలనొప్పి రావడం, తీవ్ర జ్వరం, వాంతులు కావడం స్పృహ కోల్పోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులు రక్తపరీక్ష చేయించుకోవాల్సిందిగా సూచిస్తారు. ఈ శాంపిల్స్ ను పూణేలోని ప్రత్యేక లేబొరేటరీకి తరలిస్తారు. చండీపురా వైరస్ ఉందా లేదా అనేది ఇక్కడ నిర్ధారిస్తారు. బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు వచ్చేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఒక వేళ చండీపురా వైరస్ అని తేలితే వెంటనే పేషెంటుకు చికిత్స అందించడం జరుగుతుంది. దీంతో చిన్నారి బతికే అవకాశాలు ఉంటాయి. చండీపురా వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చని చెబుతున్నారు నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిపుణులు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంచి ఆహారం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం చేస్తే ఇలాంటి వైరస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు.