విషాదం: లిఫ్టు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుని బాలుడు మృతి
ముంబై: మహారాష్ట్రలోని ముంబై ధారావిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోజీ షెల్టర్ భవనంలో ఐదేళ్ల బాలుడు లిఫ్టు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఇతర పిల్లలతో కలిసి కింది అంతస్తుకు వెళ్లేందుకు మహమ్మద్ హుజైన్ సర్ఫరాజ్ షేక్ అనే ఐదేళ్ల బాలుడు లిఫ్టు ఎక్కాడు.
ఆ లిఫ్టుకు గ్రిల్స్ తోపాటు దాని వెనక డోర్ కూడా ఉంది. గ్రిల్స్ తోపాటు తలుపుమూసుకోగానే లిఫ్టు కదులుతుంది. అయితు, లిఫ్టు కింది అంతస్తుకు చేరుకోగానే మిగితా ఇద్దరు పిల్లలు గ్రిల్స్, డోర్ తెరచుకుని బయటకు వెళ్లిపోయారు. చివరలో లిఫ్టులో నుంచి బయటకు వచ్చిన సర్ఫరాజ్ గ్రిల్స్ మూసివేస్తున్న క్రమంలోనే వెనుక ఉన్న తలుపు మూసుకుపోయింది.
ఆ మధ్యలోనే ఉండిపోయిన బాలుడుడికి ఎలా బయటకు వెళ్లాలో తెలియలేదు. ఈ లోపే మరొకరు లిఫ్టు బటన్ నొక్కడంతో అది కిందకు కదిలింది. మధ్యలోనే ఉండిపోయిన బాలుడు గ్రిల్స్ మధ్యే నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మొత్త ఘటన అక్కడి సీసీ టీవీలో నమోదైంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. లిఫ్టు నిర్వహణ లోపం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిర్వహణ లోపం ఉన్నట్లయితే నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.