ఫ్లాష్బ్యాక్ 2017: కీలక కేసుల్లో కోర్టులిచ్చిన సంచలన తీర్పులివే
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థలు 2017 సంవత్సరంలో పలు కీలక కేసుల్లో సంచలన తీర్పులను వెలువరించాయి. ట్రిపుల్ తలాక్, ఆరుషి హత్య కేసు, వ్యక్తిగత సమాచార గోప్యత హక్కు లాంటి కేసుల్లో కోర్టులు చరిత్రలో నిలిచిపోయే తీర్పులు ఇచ్చాయి.
Recommended Video
ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత నిలబెట్టేలా కోర్టులు తీర్పులు వెలువరించాయి. ఏడాది చివరలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్, దాణా కుంభకోణం కేసుల్లోనూ కోర్టులు సంచలన తీర్పులు ఇవ్వడం గమనార్హం.
సంచలన తీర్పులు
వ్యక్తిగత గోప్యత హక్కు, నిర్భయ దోషులకు మరణశిక్ష, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను దోషిగా తేలుస్తూ తీర్పులను వెలువరించింది. ఆరుషి హత్య కేసులో రాజేష్, నూపుర్ తల్వార్, 2జీ కుంభకోణంలో నిందితులందర్నీ నిర్దోషులు ప్రకటిస్తూ సంచలన తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు.
ట్రిపుల్ తలాక్పై చరిత్రాత్మక తీర్పు
ట్రిపుల్ తలాక్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ.. సుప్రీంకోర్టు ఈ ఏడాది చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళల హక్కులను కాలరాసేదిలా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించింది. ఇటీవలే కేంద్ర కేబినెట్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. పార్లమెంటులో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.
వ్యక్తిగత సమాచార గోప్యత హక్కుపై..
వ్యక్తిగత గోప్యత హక్కు అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. దీనిని ఏకగ్రీవంగా ఫ్రాథమిక హక్కుగా పరిగణించాల్సిందిగా ప్రకటించింది.
2012 నిర్భయ గ్యాంగ్రేప్ కేసులో..
2012 నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులకు మద్దతుగా పలుకుతూ దోషులైన నలుగురికీ సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. డిసెంబర్ 16, 2012న నిర్భయను కదులుతున్న బస్సులో అత్యాచారం చేసిన నిందితులు, ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు.
మైనర్ భార్యతో...
మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్నా అది రేప్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అనూహ్య తీర్పును వెల్లడించింది. బాల్య వివాహాలను నిరోధించడానికి ఈ తీర్పు దోహదం చేస్తుందని ఈ తీర్పుపై న్యాయ నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.
ఆరుషి హత్య కేసు
దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో తల్లిదండ్రులు నూపుర్, రాజేష్ తల్వార్లను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2013 నుంచి దాస్నా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దంపతులు కోర్టు తీర్పు తో ఈ ఏడాది జైలు నుంచి విడుదలయ్యారు.
శశికళ ఆస్తుల కేసు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళను ఆస్తుల కేసులు వెంటాడాయి. 2016లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అంతేగాక, ఆస్తుల కేసులో శశికళతోపాటు మరో ముగ్గురిని సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న శశికళ.. బెంగళూరులోని పరప్పనఅగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
డేరా బాబాకు శిక్ష
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబాగా గుర్తింపు పొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను దోషిగా తేల్చిన పంచకుల సీబీఐ కోర్టు.. 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. తీర్పు అనంతరం పంచకుల కోర్టు బయట డేరా బాబా అనుచరులు పెను విధ్వంసం సృష్టించారు.
2జీ కుంభకోణంలో సంచలన తీర్పు
యూపీఏ ప్రభుత్వ హయాంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై పాటియాల కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఏంకే నేత కనిమొళిలతోపాటు మిగితా నిందితులను కూడా కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది.
లాలూను దోషిగా తేల్చిన కోర్టు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యదవ్ను రాంచీ సీబీఐ కోర్టు శనివారం దోషిగా తేలుస్తూ తుది తీర్పు వెలువరించింది. లాలూప్రసాద్ యాదవ్తో పాటు 15 మందిని దోషులుగా ప్రకటించింది. మాజీ సీఎం జగన్నాథ్మిశ్రా సహా ఏడుగురిని నిర్ధోషులుగా తేల్చింది. కాగా, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో 1990 నుంచి 1997 వరకు పశుసంవర్థకశాఖలో పశు దానాకు సంబంధించి రూ.900 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి.