flashback 2019: అపార చాణక్యుడు, ఐపీఎస్ నుంచి నిఘా విభాగాధిపతి వరకు, ఎన్ఎస్ఏగా కీ రోల్..
అజిత్ దోవల్.. జాతీయ భద్రతా సలహాదారు. సమర్థమైన అధికారి కూడా. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ ప్రధాని నరేంద్ర మోడీ విశ్వసనీయత పొందారు. 2.0 ప్రభుత్వంలో కూడా అజిత్ దోవల్ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కొనసాగించారు. మోడీ తిరిగి నియమించుకున్న వారిలో అజిత్ దోవల్ ఒకరు కాగా, విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ సుబ్రమణియన్కు ఏకంగా క్యాబినెట్లో చోటు కల్పించి మంత్రి పదవీ కట్టబెట్టారు. 2019 సంవత్సరం ముగుస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది న్యూస్ మేకర్లో ఒకరిగా అజిత్ దోవల్ నిలిచారు. ఈ ఏడాదిలో ఆయన పోషించిన కీలక పాత్రపై సింహావలోకనం చేద్దాం.
ఇదీ నేపథ్యం..
1945లో ఉత్తరాఖండ్ ఘర్వాల్పలోని గిరి బనేల్సున్లో బ్రాహ్మణ కుటుంబంలో అజిత్ దోవల్ జన్మించారు. దోవల్ తండ్రి సైన్యంలో పనిచేయడంతో.. అజ్మీర్లోని మిలటరీ స్కూల్లో విద్యాభ్యాసం కొనసాగింది. ఆగ్రా వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పీజీ చేసి.. సివిల్స్కు ప్రిపేరయ్యారు. 23 ఏళ్లకే ఐపీఎస్కు ఎన్నికై సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1968లో కేరళ క్యాడర్ ఐపీఎస్గా కెరీర్ ప్రారంభించారు. పంజాబ్, మిజోరం తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాల్గొన్నారు. 1999లో కాందహార్లో చిక్కుకున్న భారత ఐసీ-814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపి వారిలో అజిత్ దోవల్ ఒకరు. 1971నుంచి 1999 వరకు విమానాల హైజాక్కు సంబంధించి ఉగ్రవాదులతో దోవల్ మాట్లాడేవారు.
ఐబీలో దోవల్ మార్క్
నిఘా విభాగంలో కూడా తన మార్క్ను ప్రదర్శించారు దోవల్. ఐపీఎస్గా చేరిన నాలుగేళ్లలో ఇంటెలిజెన్స్ వింగ్లో చేరారు. నిఘా విభాగం ఆ ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటిది. ఐబీ ఆఫీసర్గా కీ రోల్ పోషించారు దోవల్. మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు సమయంలో లాల్జెం నాయకులు ఏడుగురిలో ఆరుగురిని తనవైపు దోవల్ తిప్పుకోగలిగారు. మిజో నేషనల్ ఆర్మీ పతనంలో కూడా దోవల్ ముఖ్యభూమిక పోషించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్లో కూడా అజిత్ దోవల్ కీ రోల్ పోషించారు. ఆ సమయంలో సైన్యానికి ఆయన కీలకమైన వివరాలు అందజేశారు. దీంతో సైనికులకు మాత్ర ఇచ్చే కీర్తి చక్ర అవార్డును తొలిసారి పోలీసు అధికారి అయిన అజిత్ దోవల్ స్వీకరించారు. తర్వాత పాకిస్థాన్లో కూడా ఏడేళ్లు మారు వేషంలో ఉన్నారు. వేర్పాటువాది కుకా పర్రయ్ లొంగిపేయాలా చేసి మన్ననలు పొందారు. పదవీ విరమణ తర్వాత వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వేదికను ఏర్పాటు చేశారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జాతీయ భద్రతా సలహాదారునిగా బాధ్యతలు చేపట్టారు.
జాతీయ భద్రతా సలహాదారుడిగా..
ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన అజిత్ దోవల్ ఆ పదవీకే వన్నెతీసుకొచ్చారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు భాగస్వాములవుతూ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, కశ్మీర్ విభజన చేపట్టి తన మార్క్ పనితనం కనబరిచారు. రా, ఐబీ సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రత సలహాదారుడితో పంచుకుంటాయి. దోవల్ పదవీ బాధ్యతలు చేపట్టిన రెండునెలలకే ఇరాక్ ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు.
సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ అటాక్..
యురి శిబిరంపై పాకిస్థాన్ మూకలు దాడి చేయడంతో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ముష్కరులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. తర్వాత మీడియాకు వీడియోలు కూడా అందజేసింది. ఈ ఆపరేషన్ను అజిత్ దోవల్ సమర్థంగా నిర్వహించారు. తర్వాత ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడిచేశారు. దీనికి ధీటుగా బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై దాడులు చేసి క్యాంపును ధ్వంసం చేసింది. తర్వాత జరిపిన దాడుల క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ భూభాగంలో దిగి.. వారికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వియన్నా ఒప్పందం మేరకు అభినందన్ను పాకిస్థాన్, భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో కశ్మీర్ విభజన చేపట్టిన తర్వాత కూడా అజిత్ దోవల్ పాత్ర మరవలేనిది.
కశ్మీర్ విభజనలో కీలకం
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన అనంతరం.. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా మారాయి. ఆగస్ట్ 5వ తేదీన చారిత్రిక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దుచేయడంతో ఉగ్రవాదులు రెచ్చిపోతారనే సమాచారంతో అజిత్ దోవల్ స్వయంగా కశ్మీర్లో ఉన్నారు. పది రోజులకుపైగా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరింపజేసి.. ఇంటర్నెట్ బ్యాన్ చేయడంతో కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారింది. కానీ అక్కడి రోడ్లపై తిరుగుతూ, స్థానికులతో మాట్లాడుతూ అంతా బాగానే ఉందని అజిత్ ధోవల్ చెప్పించారు. వీధుల్లో తిరుగుతూ, చపాతీ తింటూ.. స్థానికుల్లో ధైర్యం కల్పించారు. కశ్మీర్లో పరిస్థితి సద్దుమణిగిందని భావించిన తర్వాతే.. తిరిగి ఢిల్లీ చేరుకొన్నారు. కశ్మీర్ అంశం సద్దుమణిగిన తర్వాత సుప్రీంకోర్టుకు అయోధ్య వివాదం చేరింది. తర్వాత మత పెద్దలతో చర్చలు జరిపి, సమన్వయం చేసి... ప్రజలకు శాంతి సందేశం ఇప్పించడంలోనూ అజిత్ దోవల్ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది.