ఫేక్ ఓటర్ ఐడీ స్కామ్: ఆ ఆరోపణల్లో నిజం లేదన్న మంజులా నంజమరి
బెంగళూరు: కర్ణాటకలో కలకలం రేపిన నకిలీ ఓటరు ఐడీ కార్డులపై కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జాలహళ్లిలోని ఓ అపార్ట్ మెంటు ఫ్లాటులో ఈ భారీ స్కామ్ వెలుగుచూడగా.. ఆ ఫ్లాట్ బీజేపీ నేత రాకేశ్ దే అని ఆరోపిస్తోంది కాంగ్రెస్.
Recommended Video
కర్ణాటకలో కలకలం: 9వేల నకిలీ ఓటర్ కార్డులు స్వాధీనం
ఈ నేపథ్యంలో ఫ్లాట్ యజమాని మంజులా నంజమరి కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. ఆ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఆ ఫ్లాట్ బీజేపీ మద్దతుదారుడు రాకేశ్ ది కాదని స్పష్టం చేశారు. ఆ ఫ్లాటులో రేఖ, రంగరాజు అనే దంపతులు అద్దెకు ఉంటున్నారని, అందులో రాకేశ్ ఉంటున్నాడన్న ప్రచారం ఫేక్ అని అన్నారు.
అంతేకాదు, బీజేపీతో తనకు సంబంధాలున్నాయన్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. '1997-2002వరకు నేను కార్పోరేటర్ గా పనిచేశాను. ఆ సమయంలో నా గెలుపుకు బీజేపీ కూడా సాయపడింది. నేనొక హౌజ్ వైఫ్, బీజేపీకి నాకు మద్దతు తెలిపింది. కాబట్టి సహజంగానే నేను బీజేపీ వైపు ఉంటాను. అంతేకానీ నేను కాంగ్రెస్ వ్యక్తిని ఎప్పటికీ కాను.' అని తేల్చి చెప్పారు.
కాగా, ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో మంజులా నంజమరి పాల్గొనడం లేదు. నంజమరి చెప్పినట్టు 2002నుంచి ఆమె బీజేపీకి, దాని భావజాలానికి మద్దతుదారుగా మాత్రమే ఉన్నారు. అంతకుముందు ఆమె కుమారుడు శ్రీధర్ నంజమరి మీడియాతో మాట్లాడారు. నకిలీ ఓటరు కార్డులు బయటపడ్డ ఫ్లాటు రాకేశ్ ది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో తనకు సంబంధాలున్నాయన్న ప్రచారాన్ని ఖండించారు.
ఇక కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా నకిలీ ఓటర్ కార్డుల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జీవాలా మాత్రం.. అది బీజేపీ నేత రాకేశ్ ఫ్లాటే అని, అతను నంజమరి కొడుకు అని, 2015లో బీజేపీ టికెట్ పైనే కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారని అంటున్నారు.