ఎన్ఆర్సీ భయం.. భయం..: దేశం దాటిపోతున్న బంగ్లాదేశీయులు, 200 మంది అరెస్ట్, మరికొందరు కూడా..
జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) ఇతర దేశాల వారిని వణికిస్తోంది. ముఖంగా బంగ్లాదేశీయులు భయాందోళనకు గురవుతున్నారు. అసోంలో ఎన్ఆర్సీ అమలు చేశామని.. ఇకదేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తామని హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించడంతో మిగతాచోట్ల ఉన్నవారు కూడా భయపడితున్నారు. భారతదేశంలో ఉండలేమని అనుకుంటూ స్వదేశం వెళ్లిపోతున్నారు.
భయం.. భయం..
అసోంలో ఎన్ఆర్సీ జాబితా విడుదలయ్యాక కొందరు స్వదేశం బారిన పడుతున్నారు. ఇక పార్లమెంట్లో అమిత్ షా ప్రకటనతో పారిపోయే వారి సంఖ్య పెరిగిపోయింది. పశ్చిమబెంగాల్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్కు వెళుతున్నారు. అలా వెళుతున్న 200 మందిని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడుంటే తమకు వేధింపులు ఎక్కవవుతున్నాయని.. ప్రతీ ఒక్కరూ బెదిరిస్తున్నారని వారిలో కొందరు పోలీసులకు తెలిపారు. వేధింపుల పర్వం బెంగళూరులో ఎక్కువ ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
55 మంది..
శనివారం బెంగళూరు నుంచి కోల్కతా మీదుగా 55 మంది పారిపోతున్నారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారిని హౌరా రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలు ఆరా తీశారు. బెంగళూరులో ఉంటామని చెప్పడంతో అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరిపి బస్సులో బెంగళూరు పంపించారు.
వలసదారుల గుర్తింపు
బెంగళూరులో అక్రమంగా ఉంటున్న వారని గుర్తించామని తూర్పు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఎస్డీ శరణప్ప పేర్కొన్నారు. వారితో 30 మంది పోలీసులను బెంగాల్ పంపించామని తెలిపారు. అక్కడ రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్న విషయం తెలిసిందని.. దీనిపై బెంగాల్ పోలీసులు, బీఎస్ఎఫ్ సమన్వయం చేసుకుంటారని పేర్కొన్నారు. అక్కడ జరిగిన ఘటనను కర్ణాటక హోంశాఖ, కేంద్ర హోంశాఖకు నివేదిస్తామని తెలిపారు.
వెళ్లిపోవాల్సిందే
నగరంలో అక్రమంగా ఉంటున్నవారు దేశం వదిలి వెళ్లిపోవాలని బెంగళూరు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రకటన వెలువరించారు. దీంతో బెంగళూరులో ఉన్న కొందరు బంగ్లాదేశీయులు తమ దేశానికి పయనమవుతున్నారు. అంతేకాదు వారి ప్రయాణ భత్యం కూడా అందజేస్తున్నట్టు తెలిపారు.
క్యాంపులో మకాం
బెంగళూరులో బంగ్లాదేశీయుల క్యాంపు ఉన్నదని బెంగళూరు పోలీసులు గుర్తించారు. సోదాలు నిర్వహించి 60 మందిని అరెస్ట్ చేశారు. అయితే వారందరూ ముస్లిములే కావడం గమనార్హం. విదేశీయులకు ఆశ్రయం కల్పించి, ఉద్యోగం కల్పించడం నేరమని బెంగళూరు పోలీసు కమిషనర్ భాస్కర్ రావు హెచ్చరించారు. వారికి ఉపాధి కల్పిస్తున్న యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
సొంతగూటికి
గత 15 రోజుల్లో మొహోశ్పూర్ మీదుగా జునేడహ్ నుంచి బంగ్లాదేశ్ వచ్చేందుకు 200 మంది ప్రయత్నించారని డాకా ట్రైబ్యున్ పేర్కొన్నది. అయితే బంగ్లాదేశ్ ఇంగ్లీష్ డెయిలీ మాత్రం ఆ సంఖ్య 329 అని చెప్పడం గమనార్హం. వీరిలో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని.. వారిని జిల్లా జైలుకు తరలించినట్టు పేర్కొన్నారు.
తప్పని పరిస్థితి..
ఇండియాలో ఎన్ఆర్సీ, బెదిరింపులతో చాలామంది తిరిగి బంగ్లాదేశ్ వస్తున్నారని అక్కడి మీడియా తెలిపింది. వీరిలో 67 మంది చిన్నారులు ఉన్నారని.. 69 మందిలో పురుషులు, స్త్రీలు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో చాలామంది బెంగళూరు నుంచి వచ్చారని వెల్లడించారు. బెంగళూరులో వారంతా రోజువారీ కూలీగా పనిచేస్తుంటారు. రూ.400 కూలీకి ప్లాస్టిక్ ఏరుతుంటామని పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఉండని పరిస్థితితో వెళ్లిపోతున్నామని.. కానీ సరిహద్దులో తమను అరెస్ట్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇండియాలో ఉండలేకపోవడం.. బంగ్లాదేశ్ సరిహద్దులో అరెస్ట్ చేయడంతో తమ పరిస్థితి అడకత్తెరలో పొక చెక్కలా మారిందని వాపోతున్నారు.