వైజాగ్-బెంగళూరు: షార్ట్కట్లో ఫ్లయిట్ జర్నీ: కేంద్రం సరికొత్త చిట్కా: రూ.1000 కోట్లు ఆదా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ వల్ల ఘోరంగా దెబ్బతిన్న రంగాల్లో పౌర విమానయానం ఒకటి. లాక్డౌన్ వల్ల అన్ని దేశాలు అంతర్జాతీయ గగనతలాన్ని మూసివేశాయి. విమానాలన్నీ రెక్కలు తెగిన పక్షుల్లా నేలకు వాలాయి. ఎయిరిండియా సహా అన్ని ప్రైవేటు విమానయాన సంస్థల కార్యకలాపాలు స్తంభించాయి. వాటిని పునరుజ్జీవింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
Recommended Video
మొత్తం ప్యాకేజీ విలువ రూ.20 లక్షల 97 కోట్లు: అయిదుదశల్లో ఇలా సర్దుబాటు చేశాం: నిర్మలా
డిఫెన్స్ ఎయిర్ స్పేస్ వినియోగం..
ప్రపంచ వ్యాప్తంగా రద్దీగా ఉండే గగనతలాల్లో భారత్ ఒకటి. సుమారు ఏడువేల విమానాలు రోజూ రాకపోకాలు సాగిస్తుంటాయి. వాటిని సవ్యంగా నడిపించడానికి పౌర విమానయాన సర్వీసుల కోసమే ప్రత్యేకంగా ఎయిర్ స్పేస్ అందుబాటులో ఉండేది. ఇస్రో రాకెట్ల ప్రయోగం సహా ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళం విమానాలు మాత్రమే రాకపోకలు సాగించడానికి 40 శాతం ఎయిర్స్పేస్ను వాటికి కేటాయించింది. ఆ మార్గాల్లో పౌర విమానయాన సర్వీసులు వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు ఇదివరకు. ఇప్పుడు దాన్ని సరళీకరించింది. డిఫెన్స్ ఎయిర్స్పేస్ను కూడా వినియోగించే దిశగా సన్నాహాలు చేస్తోంది.
కొత్తగా ఫ్లెక్సిబుల్ యూజ్ ఆఫ్ ఎయిర్స్పేస్
పౌర విమానయాన సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫ్లెక్సిబుల్ యూజ్ ఆఫ్ ఎయిర్ స్పేస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్మీ, ఇస్రోల కోసం కేటాయించిన విమాన మార్గాన్ని కూడా వినియోగించుకోవడానికి పౌరవిమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది. దీనికోసం ఫ్లెక్సిబుల్ యూజ్ ఆఫ్ ఎయిర్స్పేస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్మీ ఫ్లయిట్ పాత్ను కూడా వినియోగించుకోవాల్సి రావడం వల్ల పౌర విమానయాన సంస్థలు అరగంట ముందే గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలు కలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇన్నాళ్లూ తిరిగిన మార్గాల్లో కాకుండా షార్ట్కట్ రూట్లల్లో పౌర విమానాలు రాకపోకలు సాగించడానికి వీలు కల్పించింది కేంద్రం.
నిమిషానికే కనీసం 60 నుంచి 70 లీటర్ల ఇంధనం మిగులు..
కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల పౌర విమానాలు నిర్దేశిత షెడ్యూల్ కంటే ముందే గమ్యస్థానానికి చేరుకోగలుగుతాయి. ఫలితంగా ఇంధనం మిగులుతుంది. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి బెంగళూరు మార్గంలో ఒక విమానం బయలుదేరితే.. ఇంతకుముందు ఉన్న సమయం కంటే ముందే గమ్యస్థానానికి ల్యాండ్ అవుతుంది. దీనివల్ల ఇంధనం సర్దుబాటు అవుతుంది. కనీసం 60 లీటర్ల మేర ఇంధనం మిగలడానికి అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇలా అన్ని రద్దీ మార్గాల్లో..
ఒక నిమిషానికే 60 లీటర్ల ఇంధనం మిగులుతుందంటే.. ఇక 20 నుంచి 30 నిమిషాల సమయాన్ని తగ్గిస్తే..ఇంకెంత ఇంధనం మిగులుతుందో అంచనా వేసుకోవచ్చు. తొలిదశలో రద్దీ మార్గాల్లో ఈ ఫ్లెక్సిబుల్ యూజ్ ఆఫ్ ఎయిర్ స్పేస్ విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకుని రానుంది. విశాఖపట్నం-బెంగళూరు, ఢిల్లీ-ముంబై, ముంబై-హైదరాబాద్, ఢిల్లీ-తిరువనంతపురం, ఢిల్లీ- విజయవాడ, ఢిల్లీ-కోల్కత, చెన్నై-కోల్కత, ఢిల్లీ-బెంగళూరు.. వంటి రద్దీ రూట్లల్లో ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఏటా కనీసం వెయ్యి కోట్లు..
అనంతరం మిగిలిన మార్గాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఆర్మీ ఎయిర్ స్పేస్ను కూడా వినియోగంలోకి తీసుకుని రావడం వల్ల పౌర విమానయాన సంస్థలకు సంవత్సరానికి కనీసం వెయ్యి కోట్ల రూపాయల మిగులుతాయని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ వల్ల నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన పౌర విమానయాన సంస్థలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. దీనివల్ల ఆశించిన ఫలితాలు వస్తాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. పైగా కాలుష్యాన్ని కూడా తగ్గించినట్టవుతుందని అంటున్నారు.