ఫ్లిప్కార్ట్ సీఈఓ బిన్ని బన్సాల్ రాజీనామా...ఆరోపణలే కారణమా..?
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సహవ్యవస్థాపకులు మరియు సీఈఓ బిన్నీ బన్సల్ రాజీనామా చేశారు. అది తక్షణమే అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ వ్యవహారాలను వాల్మార్ట్ చూసుకుంటుంది. వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్లో 77శాతం వాటాలను ఈ ఏడాది మేలో విక్రయించింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనకు బిన్నీ బన్సల్ పాల్పడ్డారన్న ఆరోపణల ఆధారంగా ఆయనపై స్వతంత్ర విచారణకు ఆదేశించడం జరిగింది. తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ ఆయనపై విచారణకు ఆదేశించడంతో బిన్నీ బన్సల్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
"మంగళవారం ఉదయం ఫ్లిప్ కార్ట్ సహవ్యవస్థాపకులు సీఈఓ బిన్నీ బన్సల్ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఒక ప్రముఖ పాత్ర బిన్నీ పోషించారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరగడంతో ఆయన కంపెనీ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నందున ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు" అని వాల్మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే బిన్నీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన విచారణ సంస్థ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది.అయితే ఇతర విషయాల్లో కొన్ని తప్పులు జరిగాయని విచారణ సంస్థ నివేదికలో తెలిపింది. నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని, ఆయా సంఘటనలపై బిన్నీ రియాక్షన్ వంటివి విచారణ సంస్థ తప్పులుగా ఎత్తి చూపింది. వీటి ఆధారంగానే బిన్ని రాజీనామాను ఆమోదిస్తున్నట్లు వాల్మార్ట్ తెలిపింది.
ఇక బిన్నీ రాజీనామాతో ఖాళీ పడ్డ సీఈఓ స్థానంను కృష్ణమూర్తి భర్తీ చేయనున్నారు. దీంతో ఫ్లిప్ కార్ట్ వేదికగా మరో రెండు ఈకామర్స్ సంస్థలు మింత్ర, జబాంగ్లు వేర్వేరు సంస్థలుగా పనిచేస్తాయి. మింత్ర, జబాంగ్లకు సీఈఓగా అనంత్ నారాయణ్ వ్యవహరిస్తారు.