మోడీని చూసి నేర్చుకోండి: ఫ్లిప్కార్ట్ బన్సల్, ప్రధాని సూపర్ జవాబు!
ప్రధాని మోడీ భారత ప్రజలను చక్కగా అర్థంచేసుకుని వారిని తనవైపు ఏవిధంగా తిప్పుకోగలిగారో ఉత్తరప్రదేశ్ ఎన్నికలను చూస్తే తెలుస్తుందని సచిన్ బన్సల్ అన్నారు.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించారంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సచిన్ బన్సల్ ప్రశంసించారు. అంతేగాక, ప్రధాని మోడీ భారత ప్రజలను చక్కగా అర్థంచేసుకుని వారిని తనవైపు ఏవిధంగా తిప్పుకోగలిగారో ఉత్తరప్రదేశ్ ఎన్నికలను చూస్తే తెలుస్తుందని సచిన్ బన్సల్ అన్నారు.
మోడీ దగ్గర ఆయన ఇదే సూత్రాన్ని నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు కూడా. ఈ విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. 'ఎన్నికల ఫలితాలు చూస్తేనే తెలుస్తోంది.. మోడీ మన దేశాన్ని ఎంత బాగా అర్థంచేసుకున్నారో... ఇది వ్యాపారవేత్తలకు ఓ పాఠం కావాలి. మీరూ ఇలాగే మీ కస్టమర్లను అర్థంచేసుకోవాలి.' అని ట్వీట్ చేశారు.
#ElectionResults show how deeply @narendramodi understands India. Lesson for entrepreneurs: be fanatic about understanding your audiences
— Sachin Bansal (@_sachinbansal) March 11, 2017
More than my understanding, it is the people who have trusted the BJP & we will never betray this faith. https://t.co/EnKFoLaLDA
— Narendra Modi (@narendramodi) March 11, 2017
ఈ ట్వీట్కు ప్రధాని మోడీ స్పందించారు. 'నేను అర్థంచేసుకోవడం కన్నా ప్రజలు నాపై, నా పార్టీపై విశ్వాసం ఉంచారు. దాన్ని నేనెప్పటికీ వమ్ముకానివ్వను' అని ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్కు చాలా మంది నెటిజన్లు లైక్ కొట్టారు.
ఈ విజయం తమ బాధ్యతను పెంచిందని మోడీ పేర్కొన్నారు. పేద ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఈ విజయాలను చూస్తే తెలుస్తోందని అన్నారు. నూతన భారతాన్ని నిర్మించేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. మనమంతా కలిసి అభివృద్ధి సాధించాలని అన్నారు.