ఫ్లిప్కార్ట్ రికార్డ్: 10గంటల్లో 5లక్షల మొబైళ్ల సేల్, లిస్ట్లో విశాఖ
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ రికార్డ్ అమ్మకాలు జరిపింది. 13వ తారీఖు నుంచ 17వ తారీఖు వరకు బిగ్ బిలియన్ డే సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ప్రారంభమైన మొబైల్ విక్రయాలు కేవలం పది గంటల్లోనే ఐదు లక్షలకు చేరాయని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
దసరా పురస్కరించుకుని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రత్యేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో రంగప్రవేశం చేసిన బిగ్ బిలియన్ డే సేల్కు బుధవారం రాత్రి నుంచే వినియోగదారులు పోటెత్తారని సంస్థ తెలిపింది.
రాత్రి ప్రారంభమైన మొబైల్ ఫోన్ల విక్రయాలు పది గంటల్లోనే ఐదు లక్షల మార్కును తాకాయని చెప్పింది. ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లోనూ 10 గంటల వ్యవధిలో ఐదు లక్షల హ్యాండ్సెట్లు అమ్ముడుబోవడం ఇదే ప్రథమమని ఫ్లిప్కార్ట్ వాణిజ్య విభాగం అధిపతి ముఖేశ్ బన్సల్ చెప్పారు.
అమ్ముడుపోతున్న మొబైల్ ఫోన్ల విషయానికొస్తే... 75 శాతం మొబైళ్లు 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేసేవేనంటున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు నాగపూర్, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు, ఏపీలోని విశాఖ నుంచి పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ సైట్ ద్వారా కొనుగోళ్లు జరిపారని బన్సల్ వెల్లడించారు.
ఫ్లిప్కార్ట్ను ఆరు మిలియన్ల ప్రజలు విజిట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి సెకండ్కు 25 వస్తువులు అమ్ముడుపోతున్నాయి. కొనుగోళ్లలో మెట్రో సిటీల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలు టాప్లో, నాన్ మెట్రో సిటీల్లో లుథియానా, లక్నో, భోపాల్ ఉన్నాయి. ఫ్లిప్కార్టులో 70 విభాగాల్లో 30 మిలియన్ల ఉత్పత్తులు ఉన్నాయి.