వెంటనే రూ. 3 వేల కోట్లు ఇవ్వండి, ప్రధాని మోడీకి కర్ణాటక సీఎం మనవి, రూ. 40 వేల కోట్ల నష్టం!
బెంగళూరు: బెళగావితో పాటు కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయని, వెంటనే రూ. 3, 000 కోట్ల నష్ట పరిహారం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం సహాయం చేస్తుందని తనకు నమ్మకం ఉందని సీఎం యడియూరప్ప మీడియాకు చెప్పారు.
అమిత్ షా, యడియూరప్ప ఏరియల్ సర్వే
కేంద్ర రక్షణ శాఖా మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బెళగావితో పాటు పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వేతో పరిస్థితి సమీక్షించారు. బెళగావి జిల్లాలో వరదల కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భాదితులను పరిహార కేంద్రాలకు తరలించారు. ఎంత నష్టం జరిగింది అనే విషయం ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కేంద్ర మంత్రి అమిత్ షాకు ఇప్పటికే వివరించారు.
రూ. 40 వేల కోట్ల నష్టం !
భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 10, 000 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలో వెలుగు చూసిందని సీఎం యడియూరప్ప అన్నారు. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే రూ. 30, 000 కోట్ల నుంచి రూ. 40, 000 కోట్ల నష్టం జరిగిందని, అధికారులు తుది అంచానా వేసిన తరువాత అసలు విషయం వెలుగు చూస్తుందని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీకి మనవి
బెళగావి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాల దెబ్బకు వరదలు వచ్చాయని, వెంటనే ప్రజలను ఆదుకోవడానికి రూ.3,000 కోట్ల నష్ట పరిహారం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు.
ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
పశువులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ప్రజలకు వెంటనే సహాయం చెయ్యడం ప్రభుత్వం మొదటి భాద్యత అని, అందులో ఎలాంటి రాజీ లేదని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు. వరద భాదితులకు వెంటనే పరిహారం అందిస్తామని సీఎం యడియూరప్ప హామీ ఇచ్చారు.
ప్రజలకు అండగా ఉంటాం
భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు, నివాసాలు కొల్పోయిన రైతులు, ప్రజలు ధైర్యంగా ఉండాలని, మీకు అండగా ప్రభుత్వం ఉంటుదని, వెంటనే పరిహారం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, ధైర్యంగా ఉండాలని ప్రజలకు సీఎం యడియూరప్ప మనవి చేశారు.