కేరళ వరద బాధితులకు కేంద్రం అండ, రూ.200కే ఎల్పీజీ కనెక్షన్
తిరువనంతపురం: కేరళ వరద బాధితులకు కేంద్రం ఓ ఊరట కల్పించింది. వారికి రూ.200కే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ను అందించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. వరదల కారణంగా ప్రజలు ఇళ్లు, వాకిళ్లు కోల్పోయారు.
బాధితులు రిలీఫ్ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఇళ్లలో బురదతో నిండిపోయిన సామాగ్రి ఉంది. వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టింది.
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి రూ.200కే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ను ఇవ్వాలని, మిగతా వారికి రూ.1200కు ఇవ్వాలని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ ప్రతిపాదన పెట్టారు.
ఈ ప్రతిపాదనను పరిశీలించిన పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర అంగీకరించారు. సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొందేందుకు రూ.1400 చెల్లించాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రూ.200కే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని అన్ని ఆయిల్ కంపెనీలకు కేంద్రమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేరళ వరదల కారణంగా దాదాపు 480 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.