పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు.. 100దాటిన మృతులు
Recommended Video
భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. గూడు కోల్పోయిన ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 100 మందికిపైగా మృత్యువాత పడ్డారు.
అసోంలో 40మంది మృతి
అసోంలో 33 జిల్లాల్లో 28 వరద ప్రభావానికి లోనయ్యాయి. దాదాపు 54లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 40 మంది ప్రాణామలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి పగలన్న తేడాలేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
బీహార్ను ముంచెత్తిన వరదలు
భారీ వర్షాలు బీహార్ను ముంచెత్తుతున్నాయి. నేపాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం రాష్ట్రం మీద పడింది. కొన్ని రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 70మందికి పైగా మృతి చెందారు. మరో 55 లక్షల మంది నిరాశ్రయులైనట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. సీతామర్హి, మధుబని, అరేరియా, షియోహార్, దర్భంగా, పూర్నియా, కిషన్ గంజ్, సుపాల్, ఈస్ట్ చంపపారన్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 1119 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
12 జిల్లాలను వణికిస్తున్న వర్షాలు
బీహార్ వ్యాప్తంగా 12 జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. 26 ఎన్జీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. నేపాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి వరద నీరు బీహార్లోని లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటోందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ఆరు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.