సహనానికి సలాం: పెట్రోల్ కోసం గంటల తరబడి ఓపిగ్గా క్యూలో నిల్చున్న మళయాళీలు
కేరళ: వరదలతో అల్లాడిపోయిన కేరళ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. 10 రోజుల తర్వాత మళ్లీ ప్రజలు రోడ్లపై కనపడుతున్నారు. ఈ పదిరోజులు క్షణం ఒక యుగంలా గడిచింది అక్కడి ప్రజలకు. ఇంకా సహాయక శిబిరాల్లో చాలామంది సేదతీరుతున్నారు. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వాటిని క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు. గత వందేళ్లలో ఎప్పుడూ రాని విపత్తును కేరళ ఎదుర్కొంది. ఈ వరదల దాటికి చాలామంది మరణం అంచువరకు వెళ్లి తిరిగివచ్చారు. అలాంటి కష్టాలు పగవాడికి కూడా రావొద్దని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
Queue for fuel #Kerala #KeralaFloods pic.twitter.com/v7eTMaY5iy
— Gautam Trivedi (@KaptanHindustan) August 22, 2018
ఇక కేరళను వరదలు ముంచెత్తాక ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగవుతోంది. వర్షాలు తెరిపివ్వడంతో సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. వరదల కంటే ముందు ఎలాగైతే అక్కడి ప్రజలు జీవించారో... అంతకంటే కష్టంగా ఇప్పుడు వరదల తర్వాత జీవించాల్సి వస్తోంది. ఎటు చూసిన తెగిన రహదారులు, నేలకొరిగిన ఇళ్లు, భవంతులే కనిపిస్తాయి. ఇప్పటికీ రెండు వారాలు గడిచాయి. సాధారణ స్థితికి చేరుకునేందుకు కేరళ ప్రయత్నిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ అక్కడి ప్రజలు ఎంతో క్రమశిక్షణ, సంయమనం పాటించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
కేరళను వరదలు ముంచెత్తిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపై కనిపిస్తున్నారు. అక్కడక్కడ దుకాణాలు తెరిచారు. పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులు భారీ క్యూలో నిల్చొని గంటల తరబడి తమ ఛాన్స్ కోసం వేచిచూస్తున్నారు. ఎక్కడే కానీ వారు సహనం కోల్పోవడం లేదు. క్యూలైన్లో బారులు తీరారు. కొన్ని కిలోమీటర్ల మేరా వారు లైన్లో ఉండటం చూస్తే ఎంతటి క్రమశిక్షణతో ఉన్నారో అర్థమవుతుంది. ఇదే దృశ్యం దుకాణాల బయట కనిపిస్తోంది. వాహనదారులు రోడ్డుపై ఎటు పడితే అటు కాకుండా చక్కగా ఒకరి తర్వాత ఒకరు వరుసలో తమ వాహనాలతో నిల్చోవడం చూస్తే వారిని ఎవరైనా సరే అభినందించాల్సిందే. ఇలా పెట్రోల్ బంకు బయట బారులు తీరిన వాహనదారుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.