అసోం, బీహర్లో వరద బీభత్సం, 47 మంది మృతి
గౌహతి : భారీ వర్షాలు, వరదలతో అసోం, బీహర్ చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రజలతోపాటు మూగజీవాలు బిక్కుబిక్కుమంటున్నాయి. మరోవైపు వరదలతో మృతుల సంఖ్య 47కి చేరింది. మరోవైపు పంజాబ్, హర్యానాలో వర్షం కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీలో కూడా వర్షం కురిసింది. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలోని ఆరు జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
వరదలు బీహర్లోని 16 జిల్లాలపై ప్రభావం చూపింది. 25.71 లక్షల ప్రజల వరద ప్రభావానికి గురయ్యారు. ఒక్క బీహర్లోని ఇప్పటివరకు 25 మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎగువన ఉన్న నేపాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయని .. అక్కడ నదులు నిండి దిగువకు ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. బీహర్లో లక్ష మంది ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇటు అసోంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. 33 జిల్లాల్లో వరదనీరు పోటెత్తింది. రాష్ట్రలో 45 లక్షల మంది వరదనీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 17 మంది చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు.
90 శాతం కజిరంగ పార్క్ వరదనీటితో నిండిపోయింది. దీంతో మూగజీవాలు నిలువనీడ లేకుండా అల్లాడిపోతున్నాయి. బ్రహ్మపుత్ర నదీని అనుకొని పార్క్ ఉంది. దీంతో నది నిండుకుండలా మారి .. నీరు ఊబికిరావడంతో పార్క్ మొత్తం నీటితో నిండిపోయింది. మరోవైపు గౌహతి, ఉజాన్ బజార్, ఖార్గులీ, భారలముఖ్ ప్రాంతాలపై కూడా వర్ష, వరద ప్రభావం చూపింది.