వీళ్లా ప్రజాప్రతినిధులు: గోవధకు పాల్పడ్డారు...అందుకే కేరళలో వరదలు అన్న బీజేపీ ఎమ్మెల్యే
Recommended Video
కేరళ వరదలపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు రకాలైన వార్తలు వస్తున్నాయి. ఈ విపత్తు కాలంలో అక్కడి స్థానికులకు అండగా నిలవడం పోయి చాలామంది ఈ వరదలు ఎందుకు వచ్చాయో దానికి కారణం ఏమిటో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. శబరిమలై ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినందుకే ఈ సహజ విపత్తు వచ్చిందని కొందరు పోస్ట్ చేస్తే మరికొందరు మళయాళీలు గోమాంసం తింటారు కాబట్టే వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయంటూ పలు పోస్టులు చేశారు. సామాన్య ప్రజలు ఇలా చేస్తున్నారంటే ఏదో తెలియక చేస్తున్నారులే అనుకోవచ్చు. కానీ ప్రజాప్రతినిధులే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది నిజంగా దురదృష్టకరమే.
తాజాగా కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కేరళ వరదలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. హిందూ సెంటిమెంట్లను కేరళీయులు అగౌరవపరిచినందుకే వారికి ఈ దుస్థితి వచ్చిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే బసన్గౌడ పాటిల్. కేరళలో గోవధకు పాల్పడతారు కాబట్టే ఆరాష్ట్రం వరదలతో అల్లాడిపోయిందని చెప్పుకొచ్చారు. గోవధ చేయడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. ఇప్పుడు కేరళలో కూడా అదే జరిగిందన్నారు. గోవధకు పాల్పడ్డారు... ఒక ఏడాదిలోనే వరదలతో వారి స్థితి ఎలా తయారైందో ప్రత్యక్షంగా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలను, పద్ధతులను ఎవరైనా గాయపరిస్తే వారికి శిక్ష తప్పదని పాటిల్ అన్నారు.
గతేడాది కేరళలో జరిగిన బీఫ్ ఫెస్టివల్ గురించి ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడారు. గోవధ, గోవులతో వ్యాపారం చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. వారు అలా చేసినందుకే నేడు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు పాటిల్. ఇలా నోరుపారేసుకోవడం పాటిల్కు ఇది మొదటి సారి కాదు. కర్నాటక హోమ్ మినిస్టర్గా తాను ఉండిఉంటే మేధావులు, ప్రతిభావంతులను కాల్చి పారేసేవాడినని వారు సమాజానికి ప్రమాదకరమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కర్నాటక ఎన్నికల తర్వాత ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన ముస్లింల అభివృద్ధికి పనిచేయకూడదని వారు బీజేపీకి ఓటు వేయలేదని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. తను గెలిచానంటే అది కేవలం హిందువులు వేసిన ఓటుతోనేనని చెప్పారు. హిందువుల అభివృద్ధి కోసమే తాను పనిచేస్తానని ముస్లింలకోసం కాదని చెప్పుకొచ్చారు.