మారని కర్ణాటకం : బలపరీక్ష నేటికి వాయిదా, సాయంత్రం నిర్వహిస్తామన్న స్పీకర్
బెంగళూరు : క్షణ క్షణం ఉత్కంఠ, ఆ వైపు విపక్షం. బలనిరూపణ కోసం ఉడుం పట్టు. ఇటు వైపు అధికార పక్షం.. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ కోసం నిరీక్షణ.. వెరసి సోమవారం కూడా కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వ బలనిరూపణ వాయిదా పడింది. ఉదయం నుంచి ట్విస్టులతో కొనసాగిన సభ .. చివరికి రాత్రి 12 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కే ఆర్ రమేశ్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారభమవుతుందని స్పష్టంచేశారు.
గురు, శుక్రవారాల మాదిరిగానే సోమవారం కూడా కర్ణాటక అసెంబ్లీ జరిగింది. విపక్ష బీజేపీ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ ముగియలేదు. బలపరీక్ష వరకు వెళ్లలేదు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వం తమ సర్కార్ను కాపాడుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ మంగళవారం విచారణకు వస్తోన్న కారణం చూపి సోమవారం కూడా బయటపడింది. మరోవైపు రెబల్ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఒక ఎమ్మెల్యేను తమ క్యాంపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాత్రి 9 గంటలకు మొదలైన సభ అధికార, విపక్షాల సభ్యుల నినాదాలతో మారుమోగింది. బలపరీక్షకు బీజేపీ పట్టుబడితే .. మంగళవారం నిర్వహిద్దామని సంకీర్ణ ప్రభుత్వ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంతలో సభ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి సీఎల్పీ నేత సిద్దరామయ్య కలుగజేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేయాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష చర్చను ప్రారంభించి .. సాయంత్రం 6 గంటల వరకు పూర్తి చేద్దామని తెలిపారు. సీఎల్పీ నేత వాదనకు అంగీకరించిన స్పీకర్ .. సభను మరుసటిరోజుకు వాయిదావేశారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం బలపరీక్షను సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేస్తామని ప్రకటించి .. సభను వాయిదా వేశారు.