దారుణం: పిండి గిర్నీలో పడి నలుగురు చిన్నారులు మృతి
పాట్నా: బీహార్లో దారుణం చోటు చేసుకుంది. గోధుమలను పిండి పట్టే ఓ పిండిగిర్నీలో పడి నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని బేగుసరాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు పిల్లల పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సోమవారం జరిగిన ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు గోధుమలను గిర్నీ పట్టేందుకు మిషన్ చుట్టూ గుమి గూడినపుడు, నలుగురు పిల్లల్ని పట్టి లాగేసిందని అధికారులు తెలిపారు. దీంతో నలుగురు పిల్లలు అక్కడిక్కడే చనిపోయారన్నారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా అధికారి అమరిందర్ ప్రసాద్ సింగ్ బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారిని కార్గిల్ దాస్, శ్రావన్ దాస్, పూనం దేవి, బిట్టో దాస్లుగా పోలీసులు గుర్తించారు. బాధిత ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అనీ, గాయపడినవారికి తగిన వైద్యసహాయం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపు నుంచి అన్ని రకాల సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
సంఘటనా స్ధలానికి చేరుకున్న ఎస్పీ వరుణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పిండి గిర్నీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో గోధుమలను పిండి చేసేందుకు ట్రాలీ, ట్రాక్టర్లలో ఇలాంటి పిండిగిర్నీలను ఎక్కువగా వాడుతుంటారు.