ఫేక్ కరెన్సీ కలకలం: రూ.30కే రూ. 2000ల నోట్లు, రూ. 900 విక్రయం, పాక్ కుట్రే
న్యూఢిల్లీ: ఇప్పటికే పీఓకేలో పాకిస్థాన్ ఐఎస్ఐకి రెండు నకిలీ నోట్ల ఫ్యాక్టరీలు ఉన్నట్లు గుర్తించిన భద్రతాదళాలు.. దేశ రాజధానిలో నకిలీ నోట్ల చలామణి గుట్టు రట్టుచేశారు. నకిలీ కరెన్సీ నోట్లు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడిని విచారించగా అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నకిలీ నోట్లను పాకిస్థాన్ నుంచి తీసుకొస్తున్నట్లు సదరు నిందితుడు చెప్పడం గమనార్హం.
ప్రధాన నిందితుడి అరెస్ట్
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ నోట్ల వ్యవహారంలో పశ్చిమబెంగాల్కు చెందిన కాషిద్ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. నిఘా సంస్థల సమాచారంతో ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కాషిద్ను అదుపులోకి తీసుకున్నారు.
15ఏళ్లుగా నకిలీ నోట్ల దందా..
ఈ దాడుల్లో రూ. 6.6లక్షల విలువ చేసే 330 నకిలీ రూ.2000 నోట్లను గుర్తించారు. కాగా.. గత 15ఏళ్లుగా తాను ఈ దందాలో ఉన్నట్లు కాషిద్ విచారణ సమయంలో చెప్పాడు. ఢిల్లీ, యూపీ, బిహార్లకు ఈ నోట్లను సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు.
పాక్ నుంచే ఫేక్ కరెన్సీ.. రూ.30కే
అయితే ఈ నోట్లను తాను పాకిస్థాన్ నుంచి తీసుకొస్తున్నట్లు కాషిద్ వెల్లడించాడు. పాక్కు చెందిన ఓ వ్యక్తి బార్డర్ ఫెన్సింగ్ నుంచి ఈ డబ్బులను భారత్ వైపు విసిరేస్తాడని చెప్పాడు. 100నోట్లకు రూ.30 చొప్పున తాను ఈ నోట్లను కొనుగోలు చేసి తర్వాత రూ. 45 చొప్పున విక్రయిస్తానని వివరించాడు.
పాక్ నిఘా సంస్థే కుట్రదారు
కాగా, తాజా రూ. 2000 నకిలీ నోట్లను మాత్రం రూ. 900లకు విక్రయించినట్లు కాషిద్ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టామని, ఇందులో పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే పీఓకేలు ఐఎస్ఐకి రెండు నకిలీ నోట్ల ఫ్యాక్టరీలు ఉన్నట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. అక్కడ్నుంచే దేశంలోకి నకిలీ నోట్లు వస్తున్నాయని వెల్లడించింది.