హమ్ భారత్ కె లోగ్..: ప్రతి ముసల్మాన్ ఇంటి మీదా త్రివర్ణ పతాకం: అసదుద్దీన్ పిలుపు..!
Recommended Video
హైదరాబాద్: శతాబ్దాల కాలం నుంచీ భారత గడ్డ మీద నివసిస్తోన్న ముస్లింల మనుగడకు కొత్తగా ముప్పు వచ్చిందని, భారతీయుడినని నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారతీయుల్లో భారతీయుడిగా కలిసి పోయిన ముస్లింలను విడదీయడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.
20 వేల మందికి పైగా..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా ఏఐఎంఐఎం భారీ బహిరంగ సభను నిర్వహించింది. శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 20 వేలమందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ప్రతినిధులు, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మువ్వన్నెల పతాకంతో..
జాతీయ పతాకాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని, రాజ్యంగ నమూనా ప్రతిని పట్టుకుని కనిపించారు వారంతా. బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హమ్ భారత్ కె లోగ్.. అంటూ నినదించారు. వేలాదిమంది మజ్లిస్ కార్యకర్తలు, నాయకుల రాకతో ప్రధాన కార్యాలయం దారుస్సలాం సమీపంలోని మైదానం క్రిక్కిరిసిపోయింది.
ప్రాణత్యాగానికైనా సిద్ధ పడాల్సిందే..
దేశంలోని ప్రతి ముస్లిం కూడా తాను భారతీయుడినని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసదుద్దీన్ అన్నారు. ఇందులో భాగంగా- ప్రతి ముస్లిం ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పతాకాన్ని ఎగుర వేసి, తమ దేశభక్తిని చాటుకోవాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్ని సంవత్సరాల తరువాత కూడా భారతీయులమని నిరూపించుకోవాల్సిన దుస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు.
అమాయకుల ప్రాణాలు బలి..
భారత్ తన దేశమని, దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తామని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. జాతిపిత మహాత్మాగాంధీ, అంబేద్కర్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి మహనీయులను అవమానించేలా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కర్ణాటకలోని మంగళూరులో, ఉత్తర ప్రదేశ్ లో పోలీసుల తూటాలకు అమాయక ముస్లింలు బలి అయ్యారని, వారి కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు.