వందేభారత్ ఎక్స్ప్రెస్కు వరుస ప్రమాదాలుః ఈ సారి రాళ్లు, అద్దాలు ధ్వంసం..కారణం?
న్యూఢిల్లీః దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదాలు వీడట్లేదు. పట్టాలెక్కినప్పటి నుంచీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి గురవుతూనే ఉంది ఈ ఎక్స్ప్రెస్. గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో రాకపోకలు సాగించే ఈ రైలు ఉత్తర్ ప్రదేశ్ లో ప్రమాదానికి గురైంది. పట్టాల పక్కన పరిచిన గులకరాళ్లు తగిలి, లోకో పైలెట్ క్యాబిన్ విండ్ స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడ్డాయి. కిటికీలకు బిగించిన అద్దాలు పగిలిపోయాయి. ఆ ముక్కలు ప్రయాణికులపై పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ నెల 15వ తేదీన న్యూఢిల్లీ స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత నిరాడంబరంగా ఈ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజే పుల్వామాలో ఉగ్రవాదుల దాడి చోటు చేసుకోవడం, ఈ దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమర వీరులైన నేపథ్యంలో మోడీ.. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. 17వ తేదీ నుంచి ఈ రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి వారణాశికి ఎనిమిది గంటల్లో రాకపోకలు సాగించే సామర్థ్యం దీని సొంతం.
పట్టాలెక్కిన తరువాత వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఈ ఎక్స్ప్రెస్ ప్రమాదాలను చవి చూసింది. అవన్నీ స్వల్పమైనవే. ఆదివారం కూడా మరోసారి ప్రమాదానికి గురైంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అచల్డా వద్ద ఈ రైలు ఢిల్లీ వైపు ప్రయాణిస్తున్న సమయంలో.. ఢిల్లీ నుంచి అసోం వైపునకు వెళ్తున్న దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్ప్రెస్ పక్క ట్రాక్పై ఎదురుగా వచ్చింది. అదే సమయంలో- దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్ప్రెస్ మూడు గేదెలను ఢీ కొట్టింది. పట్టాలపై కొంత దూరం ఈడ్చుకెళ్లింది.
ఫలితంగా- పట్టాల వద్ద పరిచిన గులక రాళ్లు శరవేగంగా ఎగిరి వెళ్లి, పక్కన మరో ట్రాక్ పై వెళ్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై పడ్డాయి. ఈ ఘటనలో లోకో పైలెట్ క్యాబిన్ విండ్ స్క్రీన్పై పగుళ్లు ఏర్పడ్డాయి. సీ4, సీ6, సీ7, సీ13 బోగీల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదాన్ని ఉత్తర రైల్వే ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కిటికీ అద్దాలు పగిలాయని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తర రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.