కేంద్ర బడ్జెట్ 2019 : చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ స్కీం ప్రకటించిన నిర్మలా సీతారామన్..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో దానికి సంబంధించి స్పష్టత నిచ్చింది. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి చేపట్టనున్న చర్యల గురించి నిర్మలా ప్రస్తావించారు. ఇందులో భాగంగా చిరు వ్యాపారులకు పెన్షన్ పథకాన్ని ప్రకటించారు.
దేశంలో సుమారు 3కోట్ల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వారందరికీ పెన్షన్ సదుపాయం అమలు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించారు. వార్షిక టర్నోవర 1.5 కోట్ల కన్నా తక్కువ ఆదాయమున్న రిటైల్ ట్రేడర్లకు పెన్షన్ బెనిఫిట్స్ కల్పించనున్నట్లు చెప్పారు. దీనికి ప్రధానమంత్రి కర్మ్ యోగి మాన్ ధన్ స్కీమ్ అని నామకరం చేశారు.
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న చిరు వ్యాపారులందరినీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ పథకంలో చేరిన వారందరికీ 60 ఏళ్లు దాటిన తర్వాత నెల నెలా పింఛను చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఈ స్కీంకు సంబంధించి వ్యాపారులు, కేంద్ర చెల్లించే కంట్రిబ్యూషన్ 50:50 శాతంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్న మధ్యశ్రేణి సంస్థలకు 2శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం 350కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కేవలం 59 నిమిషాల్లోపు లోక్ అమౌంట్ వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు సామాజిక కార్యక్రమాల కోసం ప్రత్యేక స్కీమ్ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పిన నిర్మల.. నిధుల సమీకరణ కోసం సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.