నిర్మలమ్మ అష్టజపం: బొగ్గు బాక్సైట్ గనులు ప్రైవేటుపరం: రక్షణ తయారీలో 74% విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తోన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీపై వివరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ మరోసారి విలేకరుల ముందుకొచ్చారు. ఈ ఆర్థిక ప్యాకేజీ మీద వారిద్దరూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. ఆర్థిక ప్యాకేజీ అమలు గురించి, ఏఏ రంగాలను దీనికిందికి తీసుకొచ్చారనే విషయంపై దశలవారీగా సమగ్ర వివరాలను అందిస్తోన్న నిర్మలా సీతారామన్.. ఈ సారి సంస్కరణల అమలుపై మాట్లాడారు.
ఎనిమిది రంగాల్లో సంస్కరణలు..
దేశవ్యాప్తంగా ఎనిమిది కీలక రంగాల్లో సంస్కరణలను అమలు చేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బొగ్గు గనులు, ఖనిజ నిల్వలు, రక్షణరంగ ఉత్పత్తులు, గగనతల నిర్వహణ, విద్యుత్ పంపిణీ (డిస్కమ్స్)లల్లో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్, స్పేస్ సెక్టార్, అణు విద్యుత్.. ఈ ఎనిమిది రంగాల్లో భారీగా సంస్కరణలను తీసుకుని రానున్నట్లు తెలిపారు. సంస్థాగతమైన సంస్కరణలను ప్రవేశపెట్టడం వట్ట వాటిని అంతర్జాతీయ స్థాయి పోటీకి ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
బొగ్గు, బాక్సైట్ గనులు ప్రైవేటు పరం..ఖనిజ తవ్వకాల్లో ప్రైవేటు పెట్టుబడులు
బొగ్గు గనులపై ప్రభుత్వ పర్యవేక్షణను తొలగించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బొగ్గు గనుల్లో కమర్షియల్ తవ్వకాలకు అనుమతిస్తామని అన్నారు. బొగ్గు బ్లాకులను కొనుగోలు చేయడానికి ఇక ఎవ్వరైనా తమ బిడ్లను దాఖలు చేయొచ్చని అన్నారు. బొగ్గు బ్లాకులను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. బొగ్గు, బాక్సైట్ గనుల బ్లాకులను ఇకపై ఉమ్మడిగా వేలం వేస్తామని తెలిపారు. ఖనిజ తవ్వకాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించబోతున్నట్లు చెప్పారు. ఈ ఎనిమిది రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పత్తిని పెంచడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
రక్షణరంగ ఉత్పత్తుల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు
రక్షణరంగ ఉత్పత్తుల్లో మరిన్ని విదేశీ పెట్టుబడుల శాతాన్ని గణనీయంగా పెంచబోతున్నామని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. ఇప్పటిదాకా 49 శాతానికి పరిమితమైన విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచనున్నామని తెలిపారు. దీనివల్ల అంతర్జాతీయ పోటీకి ధీటుగా రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఒకవంక భారత తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూనే రక్షణ రంగ ఉత్పత్తుల్లో విదేశీ పెట్టుబడులకు భారీగా అవకాశాన్ని కల్పించడం వల్ల పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. మిగులు ఖనిజాలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తామని అన్నారు.