Union Budget 2020: తన రికార్డును తానే బద్దలు కొట్టిన నిర్మలా సీతారామన్: అదేంటో తెలుసా?
Recommended Video
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్..పార్లమెంట్ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఆమె తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇదివరకు తన పేరు మీద ఉన్న రికార్డును తిరగ రాశారు. అదే- సుదీర్ఘ సమయం పాటు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించడం. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు చదివారు. పార్లమెంట్ చరిత్రలో ఇదో సరికొత్త ఒరవడిగా భావిస్తున్నారు.
Union Budget 2020: సబ్ కా సాథ్..సబ్ కా వికాస్: బడ్జెట్ స్థూల సందేశం ఇదే: నిర్మలా సీతారామన్.. !
గత ఏడాది 2 గంటల 17 నిమిషాలు..
ఈ క్రమంలో- నిర్మలా సీతారామన్ తన రికార్డును తానే అధిగమించారు. గత ఏడాది జులైలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన సమయంలో ఆమె తన ప్రసంగాన్ని ముగించడానికి 2 గంటల 17 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. ఈ సారి దాన్ని అధిగమించారు. అదనంగా 23 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు ముగించారు.
మూడో స్థానంలో జశ్వంత్ సింగ్..
ఇదివరకు బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘంగా కొనసాగించిన ఆర్థిక మంత్రిగా జశ్వంత్ సింగ్ పేరు మీద రికార్డు ఉండేది. 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో జశ్వంత్ సింగ్ ఆర్థికమంత్రిగా పని చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అప్పట్లో జశ్వంత్ సింగ్ ప్రవేశపెట్టిన చిట్టచివరి బడ్జెట్ అది. అప్పట్లో ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడానికి 2 గంటల 13 నిమిషాలు తీసుకున్నారు. గత ఏడాది వరకూ అదే రికార్డుగా కొనసాగింది. తాజాగా నిర్మలా సీతారామన్ రెండు రికార్డులను నెలకొల్పారు.
అత్యధిక పదాలు కూడా నిర్మలావే..
బడ్జెట్ ప్రతిపాదనల్లో అత్యధిక పదాలు ఉన్న మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డును నమోదు చేశారు. తాజాగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో సగటున 19, 527 పదాలు ఉన్నాయి. ఇదివరకు 1991లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 18,700 పదాలు నమోదయ్యాయి. యశ్వంత్ సిన్హా బడ్జెట్ ప్రసంగంలో 15,700 పదాలు, మొరార్జి దేశాయ్ బడ్జెట్లో 10,000, వైబీ చవాన్ బడ్జెట్ ప్రతిపాదనల్లో 9,300 పదాలు నమోదయ్యాయి.
తమిళ పద్యాలు.. కాశ్మీరీ షాయరీలు..
తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తన మాతృరాష్ట్రం తమిళనాడుకు చెందిన పలు పద్మాలను చదివి వినిపించారు. సందర్భానుసారంగా వాటిని పలికారు. ఎక్కడ? ఏ సందర్భంలో దాన్ని వాడాలో..సరిగ్గా అక్కడే వాటిని ప్రయోగించారు. దానితో అవి పేలిపోయాయి. అధికార ఎన్డీఏ కూటమి సభ్యులు.. బల్లలు చరుస్తూ హర్షధ్వానాలను వ్యక్తం చేశారు. ప్రఖ్యాత కవి దీనానాథ్ కౌల్ నదీం రాసిన కాశ్మీరీ షాయరీని తొలుత చదివి వినిపించగా.. అధికార పార్టీ సభ్యులు వహ్వా అంటూ ఆస్వాదించారు. అలాగే- తిరువళ్లువర్ రాసిన తిరుక్కురళ్, అవ్వైయ్యర్ రాసిన ఆథిఛూడి నుంచీ పలు పద్యాలను ఆమె సందర్భానుసారంగా వినియోగించారు.