నిర్మలా సీతారామన్ కు బ్యాంకు ఖాతాదారుల నిరసన సెగ: ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడతానంటూ హామీ
ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఖాతాదారుల సెగ తగిలింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముంబైకి వచ్చిన ఆమెకు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు ఖాతాదారులు తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు. పీఎంసీ బ్యాంకులో తాము డిపాజిట్ చేసుకున్న సొమ్మును నయా పైసలతో సహా తక్షణమే చెల్లించాలంటూ పట్టుబట్టారు. పీఎంసీ బ్యాంకు వ్యవహారంపై విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని, నిర్దేశిత గడువులోగా తమ డబ్బులను చెల్లించేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వందలాది మంది ఖాతాదారులతో..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం న్యూఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నారీమన్ పాయింట్ వద్ద గల పార్టీ రాష్ట్రశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్మలా సీతారామన్ వస్తున్నారనే సమాచారం తెలిసిన వెంటనే వందలాది మంది పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యాలయం వద్ద కారు దిగిన వెంటనే ఆమెను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అట్టుడికిన పార్టీ కార్యాలయం..
దీనితో ఖాతాదారులు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. పార్టీ కార్యాలయం వద్దే బైఠాయించారు. తమ నినాదాలతో హోరెత్తించారు. వారి నిరసన ప్రదర్శనలతో నారీమన్ పాయింట్ ప్రాంతం అట్టుడికి పోయింది. ఫలితంగా- బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మలా సీతారామన్ ను కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఖాతాదారులు గట్టిగా నినాదాలు చేశారు. కార్యాలయం లోనికి వెళ్లడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డగించడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. కొందరు ఖాతాదారులు అక్కడున్న పూలకుండీలను పగులగొట్టారు.
చర్చలకు ఆహ్వానం..
కొద్దిసేపటి తరువాత నిర్మలా సీతారామన్ పీఎంసీ బ్యాంకు ఖాతాదారులను సమావేశానికి ఆహ్వానించారు. మొత్తం ఖాతాదారులందరి తరఫున కొంతమందిని మాత్రమే లోనికి పంపించారు. నిర్మలా సీతారామన్ వారితో భేటీ అయ్యారు. పీఎంసీ బ్యాంకు మూత పడటానికి గల కారణాలను వారికి వివరించారు. బ్యాంకు యాజమాన్యం ఆర్థిక మోసాలకు పాల్పడిందని, అందువల్లే నగదు విత్ డ్రా చేయడంపై ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అన్నారు. అవేమీ తమకు పట్టబోవని, తమ డబ్బులు తమ వెంటనే చెల్లించాలని ఖాతాదారులు పట్టుబట్టారు.
రిజర్వు బ్యాంకు గవర్నర్ దృష్టికి..
వారితో సమావేశం ముగిసిన అనంతరం నిర్మలా సీతారామన్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖాతాదారుల ఆవేదనను తాను అర్థం చేసుకోగలుగుతానని, పాలనా పరమైన ఆంక్షల వల్ల వారందరికీ వెంటనే డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించ లేకపోతున్నామని అన్నారు. ఈ అంశాన్ని తాను రిజర్వు బ్యాంకు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రిజర్వు బ్యాంకు ఆంక్షలను సడలించి, ఒకేసారి డబ్బును విత్ డ్రా చేసుకునేలా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఒకేసారి మొత్తం ఖాతాదారులందరూ తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు ఉన్నాయని అన్నారు.