‘ఇటలీ ఆంటీ’ చెప్పిందే మోదీ విన్నారు.. నిర్మల ప్రకటనపై సెటైర్ల వర్షం.. వలస కూలీలకు రాహుల్ భరోసా..
కరోనా లాక్డౌన్ కాలంలో వలస కూలీల వెతలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. వాళ్ల సమస్యల్ని పట్టించుకోవడంలేదన్న విమర్శలకు మోదీ సర్కార్ సమాధానమిచ్చింది. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా వలస కూలీలకు కల్పిస్తోన్న ప్రయోజనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. అయితే గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన సూచనలనే కేంద్రం మక్కీకి మక్కీ కాపీ కొట్టిందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున వలస కూలీలకు భరోసా ఇచ్చారు..
బాహుబలి ప్యాకేజీలో పేదలకు ఎంతంటే.. వలసకూలీలు, చిన్నరైతులపై నిర్మల ప్రకటన..
''కష్టాల చీకట్లు దట్టంగా కమ్ముకున్న ఈ క్లిష్ట సమయంలో మీరంతా ధైర్యంగా ఉండాలి. మీకు మేమంతా అండగా ఉంటాం. మీ బాధలు, వేదనను ప్రభుత్వానికి చేరవేసే బాధ్యతతోపాటు అవసరమైన సహాయం అందేలా కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. నిజానికి వలస కూలీలు ఈ దేశపు సాధారణ పౌరులు మాత్రమేకారు.. జాతీయ జెండా ఆత్మగౌరవాన్ని సగర్వంగా తలపై మోసేవాళ్లు. మిమ్మల్ని ఎప్పటికీ ఉన్నతంగానే కాపాడుకుంటాం..''అని రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు.
కేంద్రం ప్రకటించిన బాహుబలి ప్యాకేజీలో పేదలకు ఒనగూరే ప్రయోజనాలను వివరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వలస కూలీలకు రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ అందిస్తామని, రేషన్ కార్డులే లేకపోయినా ప్రతి వ్యక్తికి ఐదు కేజీల బియ్యం లేదా ఐదు కేజీల పిండి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ ప్రకటనపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఘాటుగా స్పందించారు.
''రేషన్ కార్డులతో సంబంధం లేకుండా వలసకూలీలు, పేదలకు వచ్చే ఆరు నెలలపాటు ఉచితంగా రేషన్ సరుకులు అందించాలని ఏప్రిల్ 10న సోనియా గాంధీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సోనియాను పదే పదే 'ఇటలీ ఆంటీ'అని విమర్శలు గుప్పించే బీజేపీ, పార్టీకి ఏమాత్రం తగ్గకుండా పంచ్ లు విసిరే ప్రధాని మోదీ చివరికి ఆ 'ఇటలీ ఆంటీ' ఐడియానే కాపీ కొట్టడం రైటేనంటారా?''అని రాజ్ దీప్ సెటర్ వేశారు.
Recommended Video
నిర్మల స్పీచ్ పై కాంగ్రెస్ పార్టీ కూడా ఘాటుగానే స్పందించింది. రూ.3500 కోట్ల ముద్రా శిశు లోన్లపై రూ.1500 వడ్డీ మాఫీ తప్పితే, నిర్మల ప్రకటించిన రెండో దశ ఉద్దీపనాల్లో కొత్త విషయమేదీ లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. వలస కూలీల సంఖ్యను 8 కోట్లుగా మంత్రి నిర్మల పేర్కొనడాన్ని బట్టి.. అసలు దేశంలో ఎంత మంది వలస కూలీలున్నారో, ప్రస్తుతానికి క్యాంపుల్లో ఎంత మంది ఆశ్రయం పొందుతున్నారో కేంద్రానికి అవగాహన లేదనే సంగతి అర్థమవుతోందని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు.