మరిన్ని 500 నోట్లు, నోట్ల పంపిణీపై ప్లాన్ ప్రకారం: శక్తికాంత దాస్
నగదు పంపిణీ పైన ప్లాన్ ప్రకారం వెళ్తున్నామని, మరిన్ని రూ.500 నోట్ల ప్రింటింగ్ పైన దృష్టి సారించామని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు, తదనంతర పరిణామాల పైన ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. నగదు పంపిణీ పైన ప్లాన్ ప్రకారం వెళ్తున్నామని, మరిన్ని రూ.500 నోట్ల ప్రింటింగ్ పైన దృష్టి సారించామని చెప్పారు.
నోట్ల రద్దు పరిణామాల పైన ప్రతిరోజు సమీక్ష జరుపుతున్నామని చెప్పారు. కొత్త నోట్ల సరఫరా రోజు రోజుకు మెరుగు అవుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు నగదును పంపించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. యాక్సిస్ బ్యాంకులో భారీ నగదు జమపై విచారణ జరుగుతోందన్నారు.
అవసరమైన మేరకు రూ.2000 నోట్లు ఉన్నాయని చెప్పారు. కొత్త నోట్ల చేరికలో తాము ఎవరినీ నిందించడం లేదని చెప్పారు. మరిన్ని రూ.500 నోట్ల ముద్రణ పైన దృష్టి సారించామని చెప్పారు. అవసరమైతే విమానాల ద్వారా వాటిని తరలిస్తామన్నారు.
నగదు పంపిణీ పై ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం
నగదు పంపిణీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోందని చెప్పారు. కొత్త రూ.2వేల నోట్ల కొరత లేదని చెప్పారు. ఇప్పటి వరకు మార్కెట్లోకి రూ.5 లక్షల కోట్ల నగదును పంపించామని చెప్పారు. కొత్త నోట్ల డిజైన్ను దేశీయంగా రూపొందించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలలో మార్పులు చేశామని చెప్పారు.
ఏడాదికి పంపే రూ.100 నోట్లు
తక్కువ మొత్తాల్లో విత్ డ్రా చేసుకునే వారి కోసం రూ.100 నోట్లను ఏడాదికి పంపించే దానిని కేవలం ఐదు వారాల్లోనే మూడింతలు పంపించామని చెప్పారు. అక్రమంగా డబ్బు నిల్వలు ఉంచిన వారిపై, పెద్ద మొత్తంలో నల్లధనం కూడబెట్టిన వారిపై, బ్యాంకు అధికారులపై ఈడీ చర్యలు తప్పవన్నారు. ఇప్పుడు ఈడీ అందుకే అనూహ్య దాడులు చేస్తోందని, వీటిని సర్జికల్ స్ట్రయిక్స్ అనుకోవచ్చన్నారు.