పార్లమెంట్ భవనం వద్ద ప్రత్యక్షమైన ఇస్రో ఛైర్మన్ కే శివన్: అజిత్ ధోవల్ తో కలిసి.. !
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా సుపరిచితుడైన భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం పార్లమెంట్ భవనం వద్ద అనూహ్యంగా ప్రత్యక్షం అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కలిసి ఆయన కనిపించారు. ఆయన ఎందుకు అజిత్ ధోవల్ ను కలిశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అజిత్ ధోవల్ ను కలుసుకోవడానికే వచ్చానని శివన్.. తనను పలకరించిన విలేకరులకు వెల్లడించారు.
నా వద్ద ఎలాంటి సమాచారమూ లేదంటూ..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కే శివన్ అజిత్ ధోవల్ తో కలిసి భవనం నుంచి వెలుపలికి రావడం కనిపించింది. దీనితో అక్కడున్న కొందరు విలేకరులు, ఫొటోగ్రాఫర్లు వారిని పలకరించారు. ఈ సందర్భంగా ఆయనను మాట్లాడటానికి ప్రయత్నించగా.. తన వద్ద పెద్దగా ఎలాంటి సమాచారమూ లేదని శివన్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అజిత్ ధోవల్ ను కలుసుకోవడానికి తాను వచ్చానని, కొన్ని అంశాలపై ఆయనతో చర్చించాల్సి ఉందని తెలిపారు.
శివన్ తో పార్లమెంట్ సభ్యుల ఫొటోలు..
తమ మధ్య ఎలాంటి చర్చల ప్రస్తావన వచ్చిందనే విషయాన్ని వెల్లడించడానికి అజిత్ ధోవల్ కూడా నిరాకరించారు. తామిద్దరి సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పారు. ఏదైనా వివరాలు ఉంటే వాటిని తానే పిలిచి మరీ వెల్లడిస్తానని నవ్వుతూ చెప్పారు. ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత కే శివన్ పార్లమెంట్ భవనానికి రావడం ఇదే తొలిసారి కావడంతో కొందరు యువ ఎంపీలు కూడా ఆయనతో ఫొటోలు దిగారు. తమను తాము పరిచయం చేసుకున్నారు.
కార్టోశాట్-3 ప్రయోగం నేపథ్యంలో..
ఉగ్రవాదుల కార్యకలాపాలు వారి శిబిరాలను కనుగొనడానికి కార్టోశాట్-3 ప్రయోగించబోతున్న నేపథ్యంలో శివన్.. అజిత్ ధోవల్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సైనికపరమైన నిఘా కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సైతం ఈ ఉపగ్రహం ఎక్కువగా దోహదపడుతుంది. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని అజిత్ ధోవల్ తో శివన్ సమావేశమై ఉండొచ్చనే అభిప్రాయాలు పార్లమెంట్ భవనం ఆవరణలో చక్కర్లు కొట్టాయి.
థర్డ్ జెన్ శాటిలైట్..
ప్రస్తుతం ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టునకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కార్టోశాట్ -3 ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపించబోతోంది. ఇదివరకు అంతరిక్షంలోనికి ప్రయోగించిన ఉపగ్రహాలతో పోల్చుకుంటే.. ఈ సారి చేపట్టబోయే ప్రాజెక్టులో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. థర్డ్ జనరేషన్ అడ్వాన్స్డ్ శాటిలైట్ వర్షన్ ఇది. హై రిజల్యూషన్ ఇమేజింగ్ దీని సొంతం. అంతకుముందు ప్రయోగించిన కార్టోశాట్లలో ఈ స్థాయి రిజల్యూషన్ లేదు. ఈ నెల 25వ తేదీన ఈ ఉపగ్రహాన్ని ఇస్రో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న విషయం తెలిసిందే.