దాణా స్కాం: లాలూను దోషిగా తేల్చిన కోర్టు, జైలుకు
లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది. ఇప్పుడు న్యాయస్థానం లాలూతో పాటు నలభై ఐదు మందిని దోషులుగా నిర్ధారించింది. కోర్టు దోషిగా తేల్చినందున లాలూకు మూడు నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.
ఈ కుంభకోణం బయటకు రావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఇప్పుడు దోషిగా నిర్ధారణ కావడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఈ కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే, ఇది ప్రత్యర్థి పార్టీల కుట్రగా ఆర్జేడి ఆరోపిస్తోంది.
కాగా లాలూను, జగన్నాథ మిశ్రాను కస్టడీలోకి తీసుకొని వారిని రాంచీ జైలుకు తరలించారు. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.